దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటైన ఇన్ఫోసిస్ తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు తెలిపింది. జనవరి 2025 నుంచి వార్షిక వేతనాలు 6-8 శాతం పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఆ తర్వాత మళ్లీ APRలో జీతాల పెంపు ఉండే అవకాశం ఉంది. కాగా, డిసెంబర్ త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.6,806 కోట్ల నికర లాభాలను ఆర్జించింది.
పరిస్థితులు ఇలా ఉన్న సమయంలో ఇన్ఫోసిస్ 6-8 శాతం వరకు వేతనాల పెంపు ప్రకటించడం గొప్ప విషయమేనని చెప్పొచ్చు. మరోవైపు.. మూడో అతిపెద్ద ఐటీ సంస్థ హెచ్సీఎల్ టెక్నాలజీస్ 1-2 శాతం వరకే వేతనాల పెంపు ప్రకటించడం తెలిసిందే. టాప్ పెర్ఫామర్లకు అక్కడ 3-4 శాతం వరకు ఉండొచ్చని తెలిసింది. సాధారణంగా సగటున 7 శాతం పెంచాల్సింది ఈసారి పరిస్థితుల దృష్ట్యా.. ఇలా ఉందని పేర్కొంది.
బెంగళూరుకు చెందిన ఈ ఐటీ కంపెనీలో ప్రపంచవ్యప్తంగా 3.23 లక్షల మంది పనిచేస్తున్నారు. ఇన్ఫోసిస్ చివరిసారిగా 2023 నవంబర్లో జీతాల పెంపును అమలు చేసింది. సాధారణంగా సంవత్సరం ప్రారంభంలో అమలు కావాల్సిన వేతన పెంపు ఆలస్యం అవుతూ వస్తోంది. ప్రపంచ డిమాండ్ వాతావరణంలో ప్రత్యేకించి ఐటీ పరిశ్రమలో విస్తృత అనిశ్చితిని ఇది ప్రతిబింబిస్తోంది. బలహీనమైన విచక్షణ వ్యయం, ఆలస్యమైన క్లయింట్ బడ్జెట్లు, కొనసాగుతున్న స్థూల ఆర్థిక అనిశ్చితి నుండి ఐటీ కంపెనీలు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.