Madhya Pradesh: బోరు బావిలో నాలుగు రోజులు.. ముగిసిన బాలుడి జీవితం
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బైతుల్ జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడి కథ విషాదాంతం అయింది. దాదాపు నాలుగు రోజుల పాటు అధికారులు చేసిన సహాయక చర్యలు ఏవీ ఫలించలేదు.;
Madhya Pradesh: మధ్యప్రదేశ్లో బైతుల్ జిల్లాలో బోరు బావిలో పడిన బాలుడి కథ విషాదాంతం అయింది. దాదాపు నాలుగు రోజుల పాటు అధికారులు చేసిన సహాయక చర్యలు ఏవీ ఫలించలేదు. ఇవాళ తెల్లవారుజామున బాలుడి డెడ్బాడీని వెలికితీశారు అధికారులు. దీంతో బాలుడి తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. రెస్క్యూ ఆపరేషన్ నాలుగు రోజుల పాటు కొనసాగడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే ఓ అధికారి కొడుకు అయి ఉంటే ఇలానే చేసే వారా అంటూ ప్రశ్నలు సంధించారు.
బైతుల్ జిల్లా మండి గ్రామానికి చెందిన తన్మయ్...ఈ నెల 6న సాయంత్రం పొలంలో ఆడుకుంటూ పక్కనే ఉన్న 55 ఫీట్ల బోరు బావిలో పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న తన్మయ్ సోదరి..తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చింది. సమాచారం అందుకున్న అధికారులు బాలుడు బావిలో పడిన గంట తర్వాత రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. బాలుడికి ఊపిరి అందేలా ఆక్సిజన్ పైపులు పంపించారు. బాలుడి చేతికి తాడు కట్టి పైకి లాగే ప్రయత్నం చేసినప్పటికీ..అది సఫలం కాలేదు.
12 అడుగుల వరకు బాలుడు బాగానే పైకి వచ్చినప్పటికీ తర్వాత తాడు తెగిపోయింది. దీంతో మరో మార్గం ద్వారా బాలుడిని రెస్క్యూ చేసే ప్రయత్నం చేశారు అధికారులు. తండ్రితోనూ బాలుడిని మాట్లాడించారు అధికారులు. చీకటిగా ఉంది నాన్న...భయం వేస్తోంది.. త్వరగా బయటకు తీయండి అంటూ తండ్రితో మాట్లాడాడు తన్మయ్. తర్వాత కొద్దిసేపటికే బాలుడి నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సహా పలువురు బాలుడి క్షేమం కోసం ట్వీట్లు చేశారు. అనేక మంది పూజలు చేశారు. కానీ అవేవి ఫలించలేదు.