GPS: ఇండియా జీపీఎస్ సేవల్లో అంతరాయం
నావిక్కు షాక్.. నిలిచిపోయిన కీలక ఉపగ్రహం.. కేవలం 3 ఉపగ్రహాలే యాక్టివ్.. స్వదేశీ నావిగేషన్కు సమస్యలు.. సిగ్నల్స్ లోపం
అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలకు దీటుగా దూసుకుపోతున్న భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశం గర్వించదగ్గ రీతిలో అభివృద్ధి చేసుకున్న స్వదేశీ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' స్తుతం తీవ్ర సంక్షోభంలో పడింది. అమెరికాకు చెందిన జీపీఎస్ (GPS) పై ఆధారపడకుండా, భారత్ సొంతంగా రూపొందించుకున్న ఈ వ్యవస్థలోని ఒక కీలక ఉపగ్రహం పనిచేయకపోవడంతో సేవలలో అంతరాయం ఏర్పడుతోంది. సాధారణంగా ఏదైనా నావిగేషన్ వ్యవస్థ కచ్చితమైన సమాచారాన్ని అందించాలంటే కనీసం నాలుగు ఉపగ్రహాల అనుసంధానం అవసరం. అయితే, నావిక్ కూటమిలోని ఎనిమిది ఉపగ్రహాలలో ప్రస్తుతం ఒక కీలక ఉపగ్రహం సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా నిలిచిపోయినట్లు సమాచారం. గత రెండు నెలలుగా ఈ సమస్య వేధిస్తున్నా, దాన్ని పునరుద్ధరించడంలో లేదా ప్రత్యామ్నాయాన్ని సిద్ధం చేయడంలో జాప్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కేవలం మూడు ఉపగ్రహాలు మాత్రమే అందుబాటులో ఉండటంతో, సిగ్నల్స్ కచ్చితత్వంలో లోపాలు తలెత్తుతున్నాయి.
నావిక్ వ్యవస్థ కేవలం సాధారణ పౌరుల కోసం మాత్రమే కాదు, దేశ రక్షణలో అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. భారత సరిహద్దులను పర్యవేక్షించే భారత సైన్యం , క్షిపణుల గమ్యాన్ని నిర్దేశించే వ్యవస్థలు ఈ నావిక్ సిగ్నల్స్ పైనే ఆధారపడతాయి. అత్యవసర సమయాల్లో విదేశీ జీపీఎస్ వ్యవస్థలపై ఆధారపడటం సురక్షితం కాదనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేసి నావిక్ ను సిద్ధం చేసింది. ఇప్పుడు ఇందులో లోపాలు తలెత్తడం సైనిక వ్యూహాలకు ఆందోళన కలిగించే అంశం. ప్రపంచ దేశాలు తమ నావిగేషన్ వ్యవస్థలను నిరంతరం ఆధునీకరిస్తుంటాయి. ఉదాహరణకు అమెరికా తన జీపీఎస్ వ్యవస్థలో ఏదైనా లోపం తలెత్తితే అత్యవసర ప్రాతిపదికన 24 గంటల్లోనే సరిచేసే సాంకేతికతను కలిగి ఉంది. కానీ, మన దేశంలో ఇస్రో (ISRO) శాస్త్రవేత్తలకు తగినంత నిధులు (Funding) అందకపోవడం వల్లే ఈ మరమ్మతు పనులు మందగించాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. శాస్త్రవేత్తల ప్రతిభకు కొదవ లేకపోయినా, పరికరాల సేకరణ మరియు ప్రయోగ ఖర్చులకు ప్రభుత్వం నుంచి అందే ప్రోత్సాహం తక్కువగా ఉండటం ఈ స్థితికి కారణమని తెలుస్తోంది.
ఆత్మనిర్భర్ భారత్" లక్ష్యంలో భాగంగా ప్రారంభమైన నావిక్ వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంది. స్మార్ట్ ఫోన్ తయారీ కంపెనీలు కూడా తమ ఫోన్లలో నావిక్ ను చేర్చుతున్న తరుణంలో, ఈ వ్యవస్థ విఫలమైతే అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్ట దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి, ఇస్రోకు అవసరమైన నిధులను విడుదల చేసి, యుద్ధ ప్రాతిపదికన కొత్త ఉపగ్రహాలను ప్రయోగించి 'నావిక్' కు పూర్వ వైభవం తీసుకురావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు. కేవలం సైనిక అవసరాలకే కాకుండా, సామాన్య ప్రజల దైనందిన జీవితంలో కూడా నావిక్ (NavIC) కీలక పాత్ర పోషించాల్సి ఉంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ఫోన్ తయారీ సంస్థలను తమ తదుపరి మోడళ్లలో నావిక్ సపోర్ట్ను తప్పనిసరి చేయాలని కోరుతోంది. ఇలాంటి తరుణంలో వ్యవస్థలో లోపాలు తలెత్తడం వల్ల గూగుల్ మ్యాప్స్ వంటి సేవలలో నావిక్ వాడకం వెనకబడిపోయే ప్రమాదం ఉంది. దేశీయ సాంకేతికతపై ప్రజలకు నమ్మకం కలగాలంటే, ఈ వ్యవస్థ నిరంతరాయంగా మరియు అత్యంత కచ్చితత్వంతో పనిచేయాలి.