ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన పని లేదు - జస్టిస్ ఎన్వీ రమణ
NV Ramana: ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ.;
ఆంగ్లం కోసం తెలుగును విడిచిపెట్టాల్సిన అవసరం లేదన్నారు భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ. చైనా, జపాన్లు పరాయి భాషల మోజులో పడలేదని.. తమ భాషలోనే విద్యను బోధిస్తూ అన్ని రంగాల్లో అగ్రస్థాయికి చేరుకోగలుగుతున్నాయని గుర్తు చేశారు. వీధి అరుగు, దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన.. తెలుగు భాష దినోత్సవ కార్యక్రమంలో సీజేఐ ఎన్వీ రమణ పాల్గొన్నారు. తెలుగు మాధ్యమంలో, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకున్న ఎంతో మంది.. నేడు ప్రపంచ మేధావులతో పోటీపడుతున్నారని సీజేఐ ఎన్వీరమణ అన్నారు.
ఎన్ని కష్టాలెదురైనా.. గమ్యం చేరగల సత్తా తెలుగువారికుందన్నారు. ఆత్మ గౌరవానికి, భాషకు, సంస్కృతికి ఎన్టీఆర్ ఎంతో ప్రాధాన్యత ఇచ్చారని కొనియాడారు. అద్భుతమైన సాహిత్యంతో తెలుగును సుసంపన్నం చేసి.. ఎందరో తారలను అందలం ఎక్కించిన సినిమా రంగంలో కూడా తెలుగు పరిస్థితి దయనీయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమా అర్థం కావాలంటే.. ఇంగ్లీషులో సబ్టైటిల్స్ చూడాల్సిన పరిస్థితి దాపురించిందని జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు.