బీజేపీపై రైతుల ఆగ్రహాం..పురపాలక ఎన్నికల్లో చరిత్ర సృష్టించిన కాంగ్రెస్
పంజాబ్ రైతులు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తంచేశారు.
నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశ రాజధాని సరిహద్దుల్లో పంజాబ్ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన సాగిస్తున్న వేళ.. పంజాబ్ రైతులు బీజేపీపై తమ ఆగ్రహాన్ని ఓట్ల రూపంలో వ్యక్తంచేశారు. పంజాబ్లోని పురపాలక ఎన్నికల్లో కమలదళాన్ని ఓడించారు. మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లలో 7 చోట్ల కాంగ్రెస్ నెగ్గింది. మరోచోట ఫలితం ఇవాళ వెలువడనుంది. అయితే ఈ ఫలితాల్లో బీజేపీ రెండో స్థానంలోనూ నిలువలేకపోయింది.
పంజాబ్లోని మొత్తం 8 మున్సిపల్ కార్పొరేషన్లకు ఫిబ్రవరి 14న ఎన్నికలు జరిగాయి. బుధవారం ఉదయం 9 గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టారు. అబోహర్, బటిండా, కపూర్తల, హొషియార్పుర్, మోగ, బటాలా, పఠాన్కోట్ మున్సిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ పార్టీ జయకేతనం ఎగురవేసింది. నగర పంచాయతీల్లోనూ చాలా చోట్ల కాంగ్రెస్ ఆధిక్యంలో ఉండగా.. శిరోమణి అకాళీదళ్, ఆమ్ఆద్మీ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేపీ నాలుగో స్థానానికి పడిపోయింది.
మొహాలీ మున్సిపల్ కార్పొరేషన్లోని రెండు పోలింగ్ కేంద్రాల్లో అవకతవకలు జరిగినట్టు ఆరోపణలు రావడంతో అక్కడ మంగళవారం రీపోలింగ్ నిర్వహించారు. అందువల్ల ఆ కార్పొరేషన్లో ఓట్లను ఇవాళ లెక్కించనున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు ఆందోళన చేస్తున్న సమయంలో ఈ ఎన్నికలు ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారాయి.
బటిండా మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ చరిత్ర సృష్టించింది. 53ఏళ్లలో తొలిసారిగా అక్కడ మేయర్ పదవిని దక్కించుకుంది. కార్పొరేషన్లో కాంగ్రెస్కు 43 స్థానాలు రాగా.. శిరోమణి అకాలీదళ్ 7 చోట్ల గెలుపొందింది. మేయర్ పదవి హస్తం పార్టీ కైవసం చేసుకుంది.