మళ్లీ విజృంభిస్తున్న కరోనా.. వరుసగా మూడో రోజూ 16వేలు దాటిన కొత్త కేసులు..!
దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది.;
దేశంలో గత కొంతకాలంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. వైరస్ వ్యాప్తి పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమైంది. కేసులు పెరుగుతున్న రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులతో కేబినెట్ సెక్రటరీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వైరస్ నిర్ధారణ పరీక్షలు పెంచాలని సూచించింది. ప్రజలు నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని, వ్యాప్తిని అరికట్టాలని కేంద్రం ఆయా రాష్ట్రాలకు సూచనలు చేసింది.
దేశంలో వరుసగా మూడో రోజు కొత్త కేసుల సంఖ్య 16వేలకు పైనే ఉంది. అయితే ఇందులో 86శాతం కేసులు ఆరు రాష్ట్రాల్లోనే నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో మహారాష్ట్ర, కేరళ, పంజాబ్, కర్ణాటక, తమిళనాడు, గుజరాత్లలో కొత్త కేసులు పెరిగినట్లు తెలిపింది. గడిచిన 24 గంటల్లో దేశంలో 16,488 కొత్త కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా పెరుగుతున్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉండగా, కేరళ రెండో స్థానంలో ఉంది. అత్యధికంగా మహారాష్ట్రలో 8 వేల 333 కేసులు బయటపడగా.. కేరళలో 3 వేల 671, పంజాబ్లో 622 మందికి కొత్తగా వైరస్ సోకినట్లు ఆరోగ్యశాఖ పేర్కొంది.
మరి కొన్ని రాష్ట్రాల్లోనూ యాక్టివ్ కేసులు పెరుగుతున్నట్లు తెలిపింది. మహారాష్ట్రలో ఫిబ్రవరి 14న 34 వేల 449 యాక్టివ్ కేసులుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 68 వేల 810కి పెరిగింది.మహారాష్ట్రలోని 28 జిల్లాల్లో కరోనా ఉద్ధృతి తీవ్రంగా ఉన్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. విదర్భ, అమరావతి, అకోలా, యావత్మాల్ జిల్లాల్లో హాట్స్పాట్లను గుర్తించినట్లు తెలిపారు. అయితే కేరళలో మాత్రం క్రియాశీల కేసులు తగ్గుముఖం పడుతుండటం కాస్త ఊరటనిస్తోంది