కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల కేసు మరో మలుపు తిరిగింది.;
కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జర్కిహోళి రాసలీలల కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసులో సామాజిక కార్యకర్త దినేష్ కలహళి తన కంప్లైంట్ను ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. బాధితురాలి పరువు, ప్రతిష్టలకు భంగం కలుగుతుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు దినేష్ ఓ లేఖను తన లాయర్ ద్వారా కబ్బన్ పార్క్ పోలీస్ స్టేషన్కు పంపించారు. దీంతో లాయర్ కుమార్.. దినేష్ పంపిన లేఖను పోలీసులుకు ఇచ్చారు. జర్కిహోళిపై దినేష్ చేసిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. తన క్లయింట్ దినేష్ ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకు లొంగబోరన్నారు. బాధితురాలికి న్యాయం చేయాలన్న ఉద్దేశంతోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
మరోవైపు..ఆపరేషన్ సీడీ ప్రకంపనలు మాత్రం కొనసాగుతున్నాయి. మరికొందరు నేతలకూ సీడీల భయం పట్టుకుంది.. ముంబైలో మకాం వేసిన 17 మంది నేతల్లో వణుకు మొదలైనట్లు తెలుస్తోంది. వీరిలో రమేష్ జార్కిహోలి రెడ్ హ్యాండెడ్గా దొరికిపోగా, మరో ఆరుగురు మంత్రులు భయపడిపోతున్నారు. ఆరుగురు మంత్రులు ముందుగానే కోర్టును ఆశ్రయించడం, గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది.
ఈ వీడియోలను బయట పెట్టిన దినేష్.. తమ వద్ద ఇంకా కొందరు మంత్రుల సీడీలు ఉన్నాయంటున్నారు. వీటిని వరుసగా బయటపెడతానని మరో బాంబ్ పేల్చారు.. దీంతో ఉలిక్కిపడిన ఆరుగురు మంత్రులు హడావిడిగా బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. తమపై అభ్యంతరకమైన వార్తలు ప్రసారం చేయకుండా ఆదేశాలివ్వాలని కోరారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన కోర్టు వెంటనే తాత్కాలిక అనుమతి ఇచ్చింది.
ఈ సీడీల వ్యవహారం పెద్ద చర్చనీయాంశమైంది. గతంలో హనీట్రాప్ చేసిన గ్యాంగ్ గత ఏడాది బెయిల్పై విడుదల కావడంతో ఇది కూడా ఆ గ్యాంగ్ పనే అయి వుంటుందా..? లేక మరో గ్యాంగ్ పనా అనే అనుమానిస్తున్నారు. అదేసమయంలో ఆరుగురు మంత్రులు కోర్టుకు వెళ్లి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకోవడం తీవ్ర విమర్శలకు కారణమవుతోంది. వీరిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని డిమాండ్ ఊపందుకుంటున్నాయి. మరి ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. మొత్తంగా ఈ సీడీల వ్యవహారం కర్నాటక రాజకీయాలను కుదిపేస్తోంది.