తమిళనాడు గవర్నర్గా రెబల్ స్టార్ కృష్ణంరాజు?
1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు, ఆ తరవాత 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు.
బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి కృష్ణంరాజుకి కేంద్ర ప్రభుత్వం గవర్నర్ పదవి కట్టబెట్టనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. త్వరలోనే కృష్ణంరాజును కేంద్ర ప్రభుత్వం తమిళనాడు గవర్నర్ గా నియమించనుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేనప్పటికీ కృష్ణంరాజుకు మాత్రం అభిమానులు అభినందనలు తెలుపుతూ ట్వీట్లు చేస్తున్నారు. ఈ వార్త విని యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులు కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు.
కృష్ణంరాజు రాజకీయ ప్రస్థానాన్ని ఒక్కసారి చూసినట్టు అయితే.. 1998లో కాకినాడ నుంచి లోక్ సభకు ఎన్నికైన కృష్ణం రాజు, ఆ తరవాత 1999లో మరోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఇక 2000 సంవత్సరంలో వాజ్పేయి ప్రభుత్వంలో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. ఆ తరవాత 2009లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీలో చేరారు. అనంతరం కొన్ని రోజులు రాజకీయాలకి దూరంగా ఉంటూ వస్తూ వచ్చిన అయన.. మళ్ళీ బీజేపీలో చేరారు.
అయితే త్వరలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపధ్యంలో అక్కడ ఎలాగైనా పాగా వేయాలని భావిస్తున్న బీజేపీ.. కృష్ణంరాజును గవర్నర్గా పంపాలని నిర్ణయించిందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, 2016లో రోశయ్య పదవికాలం ముగిసిన అనంతరం మహారాష్ట్ర గవర్నర్గా ఉన్న విద్యాసాగర్ రావే కొద్ది రోజుల పాటు తమిళనాడుకు కూడా గవర్నర్గా అదనపు బాధ్యతలను తీసుకున్నారు. ప్రస్తుతం తమిళనాడు గవర్నర్గా తిరు బన్వారిలాల్ పురోహిత్ ఉన్నారు.