భారత్ - చైనా మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న వేళ... ఇరు దేశాధినేతలు తొలిసారి భేటీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 10న జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ -SCO వార్షిక సదస్సులో భారత బృందానికి ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వం వహించనున్నారు. ఈ మేరకు కేంద్ర విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సదస్సులోనే ప్రధాని మోదీ.. చైనా అధ్యక్షుడు జిన్పింగ్తో ఆన్లైన్ ద్వారా ముఖాముఖీ చర్చలో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించే ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా ప్రతినిధుల బృందానికి జిన్పింగ్ నేతృత్వం వహిస్తున్నారు.
లద్దాఖ్ సరిహద్దు ఉద్రిక్తతలతో భారత్-చైనా మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది. దీంతో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. సరిహద్దు ఘర్షణలతో గత 6 నెలలుగా రెండు దేశాల నడుమ ప్రతిష్టంభన ఏర్పడింది. దీనిపై ఇప్పటికే రెండు దేశాలు అనేక సార్లు దౌత్య, సైనిక పరమైన చర్చలు జరిపాయి. అయినప్పటికీ పరిష్కారం లభించలేదు. ఇలాంటి సమయంలో మోదీ, జిన్పింగ్ తొలిసారి ముఖాముఖీలో కలుసుకునే అవకాశం రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు ఈ నెల 17న జరిగే బ్రిక్స్ సమావేశంలో, నవంబరు 22న జరిగే జీ20 సదస్సులోనూ మోదీ, జిన్పింగ్ వర్చువల్గా కలుసుకునే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.