Karmveer Sharma : సమస్యలు పరిష్కరించలేదని శాలరీ వద్దన్న కలెక్టర్..
Karmveer Sharma : పెండింగ్ పనులను క్లియర్ చేసేందుకు అధికారులకు డెడ్లైన్ ఇచ్చారు;
Karmveer Sharma: సమయానికి సమస్యలు పరిష్కరించలేదని డిసెంబర్ శాలరీ తీసుకోకూడదనుకున్నారు. తనతో పాటు మరికొంత మంది అధికారుల వేతనాలను కూడా నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ చేసారు జబల్పూర్ జిల్లా కలెక్టర్. ముఖ్యమంత్రి హెల్ప్లైన్కు వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడంలో జిల్లా యంత్రాంగం విఫలమైంది.
ఇందుకు బాధ్యత వహిస్తూ మధ్యప్రదేశ్లోని జబల్పూర్ జిల్లా కలెక్టర్ IAS అధికారి కర్మవీర్ శర్మ తన జీతంతో పాటు మరికొంత మంది అధికారుల వేతనాలను డిసెంబర్ నెలలో నిలిపివేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో అధికారులు సరిగా పనిచేయనందున ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని కలెక్టర్ అన్నారు.
డిసెంబర్ 27వ తేదీ సోమవారం జిల్లా పంచాయతీ కార్యాలయంలో పెండింగ్లో ఉన్న ఫిర్యాదులపై శాఖాపరమైన సమీక్షా సమావేశాన్ని శర్మ నిర్వహించారు. పెండింగ్ పనులను క్లియ్ చేసేందుకు అధికారులకు డెడ్లైన్ ఇచ్చారు. సీఎం హెల్ప్లైన్కు సంబంధించిన అన్ని కేసులను డిసెంబర్ 31లోగా పరిష్కరించాలని, అధికారిక సమావేశంలో ఒక్క ఫిర్యాదు కూడా పట్టించుకోవద్దని హెచ్చరించారు.
రెవెన్యూ కేసుల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కొందరు తహసీల్దార్లతో పాటు, కేసుల పరిష్కారంలో జాప్యం చేసినందుకు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ యూనిట్) ఇంక్రిమెంట్ నిలుపుదల చేయాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.