Rajya Sabha Ruckus: రాజ్యసభలో దుమారం రేపిన ఖర్గే వ్యాఖ్యలు..

Rajya Sabha Ruckus: భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌ అల్వార్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది.

Update: 2022-12-20 09:59 GMT

Rajya Sabha Ruckus: భారత్‌ జోడో యాత్రలో భాగంగా రాజస్థాన్‌ అల్వార్‌లో కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లిఖార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో దుమారం రేగింది. అల్వార్‌ సభలో మాట్లాడిన ఖర్గే..దేశం కోసం రాజీవ్, ఇందిరా ప్రాణాలు త్యాగం చేశారని..బీజేపీ నాయకులు ఏం చేశారో చెప్పాలని ఖర్గే నిలదీశారు. దేశం కోసం బీజేపీ నేతల ఇళ్ల నుంచి కనీసం ఒక కుక్క కూడా బలిదానం చేయలేదంటూ హాట్ కామెంట్స్ చేశారు.


దీంతో ఈ వ్యాఖ్యలపై ఇవాళ రాజ్యసభలో బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు. అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన ఖర్గే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌. ఆయన క్షమాపణలు చెప్పేంతవరకు సభలో ఉండే అర్హత లేదన్నారు. స్వాతంత్ర్యం తర్వాత కాంగ్రెస్ కనుమరుగు కావాలని మహత్మ గాంధీ భావించారని...ప్రస్తుతం ఖర్గే అదే పనిలో ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. ఎలా మాట్లాడాలో తెలియని వ్యక్తం ఓ పార్టీకి అధ్యక్షుడంటూ మండిపడ్డారు.


ఐతే తన వ్యాఖ్యలను సమర్థించుకున్నారు మల్లిఖార్జున ఖర్గే. తానూ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదన్నారు. పార్లమెంట్ బయట చేసిన వ్యాఖ్యలపై సభలో చర్చించాల్సిన అవసరం లేదన్నారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వారిని మీరు క్షమాపణలు అడుగుతున్నారా అంటూ బీజేపీని ప్రశ్నించారు. తర్వాత కేంద్రం తీరును నిరసిస్తూ ప్రతిపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి.

Tags:    

Similar News