Thoothukudi: సెలూన్లో లైబ్రరీ.. బుక్స్ చదివిన వారికి 30 % డిస్కౌంట్.. ఎక్కడంటే..
Thoothukudi: మారియప్పన్ చేస్తున్న పనిని ప్రధాని మోదీ సైతం ప్రశంసిస్తూ మన్కీ బాత్లో అతడితో మాట్లాడారు.
తాను చదువుకోలేదని, పెద్ద ఉద్యోగం చేయలేదని ఎప్పుడూ బాధపడలేదు.. పరిస్థితులు తనని అలా మార్చాయి.. అయితేనేం.. చదువుకునే వారిని ప్రోత్సహించాలనుకున్నాడు.. చదువు పట్ల ఆసక్తి కలిగించాలనుకున్నాడు.. తనవంతు ప్రయత్నంగా తాను సొంతంగా ఏర్పాటు చేసుకున్న సెలూన్లోనే ఓ లైబ్రరీని ఏర్పాటు చేశాడు తమిళనాడుకు చెందిన 39 ఏళ్ల పి పాన్ మారియప్పన్.
తన సెలూన్కి వచ్చే వారికి 30% డిస్కౌంట్ కూడా ఇస్తూ కస్టమర్లని ఆకట్టుకుంటున్నాడు. మిల్లర్పురంలోని అతని సెలూన్ వార్తల్లో నిలిచింది. మారియప్పన్ చేస్తున్న పనిని ప్రధాని మోదీ సైతం ప్రశంసిస్తూ మన్కీ బాత్లో అతడితో మాట్లాడారు.
రేడియో కార్యక్రమంలో మాట్లాడేందుకు దూరదర్శన్ సిబ్బంది తనను స్టూడియోకి ఆహ్వానించినప్పుడు, ఆ కార్యక్రమం ప్రధాని మోదీ మన్ కీ బాత్ కార్యక్రమం అని మారియప్పన్కు తెలియదు.
ప్రజలలో పఠనా శక్తి అలవాటును పెంపొందించేందుకు ఆయన చేసిన ప్రయత్నాలను ప్రధాని ప్రశంసించినప్పుడు అతడి హృదయం ఆనందంతో ఉప్పొంగింది. తన దుకాణంలో లైబ్రరీని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న స్ఫూర్తిని ప్రధాని అడిగినప్పుడు పేదరికం తనను ఎలా చదువుకు దూరం చేసిందీ మారియప్పన్ చెప్పాడు. తనకు అత్యంత ఇష్టమైన పుస్తకం గురించి మోదీ అడిగినప్పుడు తిరుక్కురల్ అని చెప్పాడు.