పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే కర్తార్ సింగ్ తన్వర్ పై వేటు పడింది. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ నుంచి పోటీ గెలిచిన ఎమ్మెల్యే కొద్ది నెలల క్రితం బీజేపీలో చేరారు. అయితే ఢిల్లీ రాజకీయాల్లో ఇటీవల జరిగిన మార్పుల వల్ల కేజ్రీవాల్ రాజీనామా చేయగా, అతిషి ఢిల్లీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. అనంతరం పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఆమె నిర్ణయించారు. ఈ క్రమంలో ఛతర్పూర్ ఎమ్మెల్యే కర్తార్ సింగ్, ఢిల్లీ అసెంబ్లీలో సభ్యత్వం కోల్పోయారు. ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ తన్వర్ను అనర్హులుగా ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ సూచనల మేరకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కర్తార్ సింగ్ తన్వర్ అసెంబ్లీ సభ్యత్వం జూలై 10 నుండి రద్దు చేయబడింది. తన్వర్ 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ పార్టీ అభ్యర్థిగా చత్తర్పూర్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. జూలైలో ఆయన ఆప్ కి రాజీనామా చేసి న్యూఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఢిల్లీ పార్టీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్దేవా సమక్షంలో బీజేపీలో చేరారు.