FLIGHT CRASH: 265కు పెరిగిన విమాన మృతుల సంఖ్య...?

శోకసంద్రంలో దేశం... . భారత విమానయాన చరిత్రలో రక్తాక్షరాలతో హృద్యంగా లిఖించదగిన రోజు;

Update: 2025-06-13 07:30 GMT

అహ్మదాబాద్ విమాన ప్రమాదం యావత్ దేశాన్ని శోకసంద్రంలో ముంచేసింది. ఈ ఘోర ప్రమాదంలో 265 మంది అమాయకులు.. ప్రాణాలు కోల్పోవడం దేశం అంతటినీ కంటతడి పెట్టించింది. ఈ ఘోర ప్రమాదంలో ప్రయాణికులతో పాటు వారి ఆశలు, ఆకాంక్షలు కూడా సజీవ దహనమయ్యాయి. రాష్ట్రపతి నుంచి సామాన్యుడి వరకు... ప్రధాని నుంచి సర్పంచ్ వరకూ.... హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకూ అందరూ ఈ ఘోర కలిలో ప్రాణాలు కోల్పోయిన వారికి అంజలి ఘటించారు. భారత విమానయాన చరిత్రలో ఈ విమాన ప్రమదాన్ని రక్తాక్షరాలతో.. హృద్యంగా లిఖించడం అందరినీ కలచివేస్తోంది.

కుప్పకూలి మంటల్లో...

గుజరాత్ లోని అహ్మదాబాద్ నుంచి లండన్ కి బయలుదేరిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787-8 డ్రీమ్ లైనర్ విమానం గురువారం కుప్పకూలి మంటలో దగ్దమైంది. ఈ ఘటనలో మొత్తం 265 మంది ప్రాణాలు కోల్పోయినట్టు అధికారులు వెల్లడించారు. వారిలో 229 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది దుర్మరణం పాలయ్యారు. ఇక విమానం వైద్య కళాశాలపై కూలడం వల్ల మరో 24మంది మృత్యువాత పడ్డట్టు అధికారులు వెల్లడించారు. అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కాసేపటికే కుప్పకూలిన ఎయిర్ ఇండియా ఏఐ171 విమాన ప్రమాదంపై ప్రాథమిక విశ్లేషణలో కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రమాదానికి ముందు విమానం గాల్లో ఉన్నప్పటి దృశ్యాలను బట్టి చూస్తే బోయింగ్ 787-8 డ్రీమ్‌లైనర్ అత్యంత అసాధారణ స్థితిలో ఉన్నట్టు స్పష్టమవుతోంది. ఇది విమాన భద్రత, సాంకేతిక అంశాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.

ఎయిరిండియా నిర్లక్ష్యం

ఈ ప్రమాదానికి ఎయిరిండియా నిర్లక్ష్యం కూడా కారణంగా తెలుస్తోంది. ఎయిరిండియా నిర్లక్ష్యంపై డీజీసీఏ ఆగ్రహం వ్యక్తం చేసింది. గత 2 నెలల్లో ఆ సంస్థకు 15 షోకాజ్ నోటీసులు పంపితే.. ఒక్క దానిపై కూడా స్పందించలేదని పేర్కొంది. అహ్మదాబాద్ ఫ్లైట్ క్రాష్ ఘటనపై విచారణ జరిపేందుకు డీజీసీఏ ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. డీజీసీఏ బృందం రాత్రంతా సోదాలు నిర్వహించింది. ప్రమాదం జరిగిన తీరుపై విశ్లేషించి ప్రాథమిక నివేదిక తయారు చేయనుంది. ఇంజిన్లు ఫెయిల్ కావడంతోనే ప్రమాదం జరిగినట్టు గుర్తించగా దీనికి గల కారణాలపై ఆరా తీస్తోంది. టేకాఫ్ నుంచి క్రాష్ అయిన ప్రాంతం వరకు డ్రోన్ సర్వే చేస్తోంది. అలాగే ఎయిరిండియా సీఈవోకి సమన్లు కూడా ఇచ్చింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపిస్తామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు స్పష్టం చేశారు. అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాదం భారత విమానాశ్రయ చరిత్రలో బ్లాక్ డేగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా తన అన్ని సోషల్ మీడియాలో ఖాతాల్లో డీపీ, కవర్ ఫోటోలను నలుపు రంగులోకి మార్చింది. మరోవైపు అహ్మదాబాద్‌లో విమాన ప్రమాదం జరిగిన చోటును ఎయిర్ ఇండియా సీఈఓ విల్సన్ పరిశీలించారు.

విజయ్ రూపానీ మరణం వెనక...

గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానీ అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. అయితే అతడి మరణం వెనక ఒక మిస్టీరియస్ నెంబర్ దాగి ఉందని నెటిజన్లు చెబుతున్నారు. అతడి అదృష్ట సంఖ్య 12 కాగా ఆయనకు కార్ల నంబర్లు 1206. విమానంలో విజయ్ రూపానీ కూర్చొన్న సీటు నెంబర్ కూడా 12, ప్రమాదం జరిగిన తేదీ 12‌‌-06 కావడం గమనార్హం. ఈ సంఖ్య అతడి జీవితంలో అదృష్టాన్ని తీసుకురావడంతోపాటు మరణాన్ని కూడా తీసుకొచ్చినట్టయింది.

Tags:    

Similar News