ప్రాణాంతక మంకీపాక్స్ కు సంబంధించి భారత్లో మరో కేసు నమోదైంది. ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ రకంగా దీన్ని గుర్తించారు. కేరళకు చెందిన యువకుడిలో గతవారం ఈ వ్యాధి నిర్ధరణ అయినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. కేరళలోని మలప్పురానికి చెందిన 38 ఏళ్ల వ్యక్తి యూఏఈ నుంచి ఇటీవల వచ్చాడు. అతడిలో ఎంపాక్స్ లక్షణాలు కనిపించడంతో వైద్య పరీక్షలు నిర్వహించగా క్లేడ్1గా నిర్ధరణ అయ్యింది. ప్రపంచ ‘ఆరోగ్య ఆత్యయిక స్థితి’కి దారితీసిన ‘క్లేడ్ 1బీ’ రకంగా దీన్ని గుర్తించారు. అయితే, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. భారత్లో సెప్టెంబర్ 9న తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. విదేశాల నుంచి వచ్చిన ఓ యువకుడి నమూనాలు పరీక్షించగా.. అది పశ్చిమ ఆఫ్రికాలో వ్యాప్తిలో ఉన్న క్లేడ్-2 రకంగా నిర్ధరించారు. అయితే, దీని తీవ్రత తక్కువగా ఉన్నట్లు వైద్యులు పేర్కొన్నారు. దాదాపు రెండు వారాల పాటు దిల్లీలోని ఎల్ఎన్జేపీ ఆసుపత్రిలో చికిత్స పొందిన బాధితుడు సెప్టెంబర్ 21న డిశ్చార్జి అయినట్లు అధికారులు వెల్లడించారు.