కొవిడ్ తరహా మహమ్మారుల సవాళ్లను ఎదుర్కొనేందుకు ప్రపంచదేశాలకు ముందస్తు సన్నద్ధత అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు. మరోమహమ్మారి ముప్పు తప్పదని, అది త్వరలో రావొచ్చు.. లేదా ఆలస్యంగా రావొచ్చు.. కానీ రావడం ఖాయం. ఇది సైద్ధాంతిక ప్రమాదం కాదు.. అంటువ్యాధి సంబంధితమైనది అని తెలిపారు. మహమ్మారుల ఒప్పందంపై ఇంటర్ గవర్నమెంటల్ సంప్రదింపుల విభాగం 13వ సమావేశంలో టెడ్రోస్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కొవిడ్-19 భయానక అనుభవాలను గుర్తుచేశారు. భవిష్యత్లో వచ్చే మహమ్మారి పరిస్థితులు శాంతించేవరకు వేచివుండదని నొక్కిచెప్పారు.
మరొక మహమ్మారి 20 ఏళ్లలోపు సంభవించొచ్చు.. లేదా రేపే చుట్టుముట్టొచ్చు.. కానీ ఈ పరిస్థితి తలెత్తడం మాత్రం తథ్యం అని చెప్పారు. రాబోయే ప్రమాదాన్ని ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. కొవిడ్ ఎంత విధ్వంసం సృష్టించిందో మీరంతా చూశారు. లక్షలాది మంది మరణించారు. మనుషులు ప్రాణాలతోపాటు, ఆర్థిక వ్యవస్థ కూడా ఛిన్నాభిన్నమైంది. ఒక్క అమెరికా ఆర్థికవ్యవస్థే 10 ట్రిలియన్ డాలర్లు నష్టపోయిందని చెప్పారు.