Flight Disruptions: ఢిల్లీ ఎయిర్పోర్ట్లో సాంకేతిక సమస్య గురించి అధికారులకు ముందే హెచ్చరికలు ?
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా తమ సూచనలు పట్టించుకోలేదు: ఏటీసీ
దేశ రాజధాని ఢిల్లీ, ముంబై అంతర్జాతీయ ఎయిర్ పోర్టుల్లో ఇటీవల సాంకేతిక సమస్య తలెత్తడంతో వందలాది విమాన సర్వీసులపై తీవ్ర ప్రభావం పడటానికి గల కీలక విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అయితే, కొన్ని నెలల ముందే ఈ విషయం గురించి అధికారులకు హెచ్చరికలు జారీ చేసినట్లు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ఇండియా తెలిపింది. ఈ ఏడాది జులైలో ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకి సమస్యలు, అప్గ్రేడ్ల గురించి చెప్పామని ఏటీసీ పేర్కొనింది. కానీ, తమ సూచనలను వారు పట్టించుకోకపోవడంతోనే ఈ ఇబ్బందులు వచ్చాయని చెప్పుకొచ్చింది.
అయితే, అహ్మాదాబాద్ విమాన ప్రమాదం తర్వాత దీనికి సంబంధించి అధికారులకు తాము లేఖ రాశామని ఏటీసీ తెలియజేసింది. ఎయిర్ నావిగేషన్ సేవల్లో ఉపయోగించే ఆటోమేషన్ వ్యవస్థలనను సమీక్షించి, అప్గ్రేడ్ చేయడం అవసరమని చెప్పింది. వ్యవస్థను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అప్గ్రేడ్ చేయాలని వెల్లడించినట్లు తెలిపారు. భారత వ్యవస్థలు యూరప్ యూరో కంట్రోల్, అమెరికా ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ల తరహాలో ఉండాలని చెప్పినట్లు పేర్కొనింది. కాగా, ఈ దేశాల్లో ఎయిర్ ట్రాఫిక్ నియంత్రణలు ఆధునిక సాంకేతికతతో వర్క్ చేస్తున్నాయి.. ఈ భద్రతా సమస్యల గురించి ఏఏఐ దగ్గర తాము అనేక సార్లు లేవనెత్తగా.. దీనిపై వారు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ గిల్డ్ ఇండియా వెల్లడించింది.