Ayodhya Ram Mandir: రామమందిరం ప్రారంభం..భక్తులు రావొద్దని సూచన

Update: 2023-12-17 07:15 GMT

ఉత్తర్‌ప్రదేశ్‌లో జనవరి 22న అయోధ్య రామ మందిరంలో జరిగే ప్రాణప్రతిష్ఠకు పెద్ద ఎత్తున భక్తులు తరలిరావొద్దని ఆలయ అధికారులు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి భారీ స్థాయిలో భక్తులు తరలి వస్తారని అంచనాలు ఉన్న నేపథ్యంలో రామ మందిర ట్రస్ట్‌ కార్యదర్శి చంపత్‌ రాయ్‌  భక్తులకు ఓ విజ్ఞప్తి చేశారు. జనవరి 22న అయోధ్యకు వచ్చే బదులు భక్తులు తమ సమీపంలోని మందిరాల్లోనే ప్రత్యేక పూజలు చేయాలని రాయ్‌ సూచించారు. అయోధ్యలో రద్దీని నివారించడం కోసమే తాము ఈ విజ్ఞప్తి చేస్తున్నట్లు వివరించారు. మరోవైపు వచ్చే భక్తుల కోసం సాధారణ భోజనం  నిద్రించడానికి స్థలం, విడిది కేంద్రాల వంటి కనీస వసతులను అందుబాటులో ఉంచేందుకు అన్నీ ఏర్పాట్లు చేస్తున్నట్లు రాయ్‌ తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌక్యరాలు కలగకుండా ఉండేందుకు తమవంతు ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. గర్భగుడి నిర్మాణం పూర్తిచేసినట్లు చంపత్‌ రాయ్‌ తెలిపారు. అలాగే విగ్రహాలు కూడా సిద్ధమయ్యాయని వెల్లడించారు. కానీ, మందిర నిర్మాణం పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టొచ్చని రాయ్ తెలిపారు. 


మరోవైపు వచ్చే నెలలో అయోధ్య రామ మందిరం ప్రారంభం కానున్న నేపథ్యంలో రామాలయ గర్భగుడిలో ఏర్పాటు చేసిన తలుపులకు బంగారు పూత పూయనున్నారు. జనవరి మొదటి వారంలో రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠకు ముందు ఈ పని పూర్తవుతుంది. రామ మందిర గర్భగుడిలో 46 ద్వారాలు ఉండగా, గ్రౌండ్ ఫ్లోర్ లో 18 గేట్లను గోల్డ్ ప్లేట్ చేయనున్నారు. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించి, ప్రాణ ప్రతిష్ఠ (ప్రతిష్ఠా కార్యక్రమం)లో చివరి ఆచారాన్ని జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించనున్నారు. ఈ తలుపులన్నీ మహారాష్ట్రలోని చంద్రాపూర్ కు చెందిన ప్రత్యేక టేకు చెక్కలతో తయారు చేశారు. వీటిని హైదరాబాద్ కు చెందిన కళాకారులు చెక్కారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఏర్పాటు చేసిన తలుపులపై చక్కటి రాగి పొరను పూసి ఆ తర్వాత వాటిని గోల్డ్ ప్లేట్ చేస్తారు.

శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా మాట్లాడుతూ, "తలుపులకు ఉపయోగించే బంగారం ఆలయానికి భక్తులు సమర్పించిన దాని నుండే ఉంటుంది" అని చెప్పారు. తలుపులకు ఎంత మొత్తంలో బంగారం పూస్తున్నారన్న ప్రశ్నకు మిశ్రా సమాధానమిస్తూ.. 'నా వద్ద ఆ వివరాలు లేవు' అని సమాధానమిచ్చారు.

Tags:    

Similar News