దేశంలోని 70 ఏళ్లు, ఆ పైబడిన వయసు కలిగిన సీనియర్ సిటిజన్లందరికీ ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని వర్తింపజేసేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. 70 ఏళ్లు, ఆపై వయస్సు కలిగిన వారికి ఆయుష్మాన్ భారత్ పథకాన్ని వర్తింపజేస్తూ తీసుకున్న ఈ నిర్ణయం గొప్ప మానవతా దృక్పథంతో కూడుకున్నదన్నారు. తాజా నిర్ణయంతో దాదాపు 6కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు లబ్ది కలుగుతుందని.. వారి సామాజిక, ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రూ.5 లక్షల వరకు ఉచిత చికిత్స సౌకర్యాన్ని పొందే అవకాశం దక్కుతుందని తెలిపారు. ఇప్పటికే ఈ పథకం కింద లబ్దిదారులుగా ఉన్న కుటుంబాల్లో ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో రూ.5లక్షలు బీమా వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. ఇతర బీమా పథకాల్లో చేరి ఉన్నవారు ఏదైనా ఎంచుకొనేందుకు వెసులుబాటు కల్పించారు. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకాన్ని 2018 సెప్టెంబర్లో కేంద్రం లాంఛనంగా ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకం కింద దేశంలోని పేద కుటుంబాల్లోని ప్రతి సభ్యునికి ఆయుష్మాన్ కార్డు అందిస్తారు. ఈ కార్డుతో ఆసుపత్రిలో చేరినప్పుడు రూ. 5లక్షల వరకు వైద్యసేవలు ఉచితంగా అందనున్నాయి.