Bhagwant Mann: స్టాండప్ కమెడియన్ నుండి పంజాబ్ సీఎంగా.. ఎవరీ భవవంత్సింగ్ మాన్?
Bhagwant Mann: పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు భవవంత్సింగ్ మాన్.;
Bhagwant Mann: పంజాబ్ సీఎంగా పగ్గాలు చేపట్టబోతున్నారు భవవంత్సింగ్ మాన్. కామెడీ రైటర్గా పొలిటికల్ సెటైర్లు వేసి నవ్వించే భగవంత్ మాన్.. ఏకంగా సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. పంజాబ్లో బలమైన సామాజికవర్గంగా ఉన్న జాట్ సిక్కు కుటుంబంలో జన్మించారు భగవంత్ సింగ్ మాన్. యూత్గా ఉన్నప్పటి నుంచే కామెడీ ఫెస్టివల్స్లో పాల్గొనేవారు.
ఇంటర్ కాలేజ్ కాంపిటిషన్స్లో స్టాండప్ కమెడియన్గా ఎన్నోసార్లు గెలిచారు. ఈ పోటీల్లో రెండుసార్లు గోల్డ్ మెడల్ కూడా సాధించారు. భగవంత్ మాన్ మొదటి కామెడీ ఆల్బమ్ జగ్తార్ జగ్గీతో. ఆ తరువాత 2006లో భగవంత్ మాన్, జగ్గీ వారి నో లైఫ్ విత్ వైఫ్ షో, 2008లో మాన్ గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ వంటి ప్రోగ్రామ్స్ చేసి గుర్తింపు తెచ్చుకున్నారు.
సినిమాల్లో సైతం నటించారు. జాతీయ అవార్డు అందుకున్న పంజాబ్ సినిమా.. మెయిన్ మా పంజాబ్ ది మూవీలోనూ నటించారు. స్టాండప్ కమెడియన్గా ఉన్న గుర్తింపుతో రాజకీయాల్లోకి వచ్చారు భగవంత్ మాన్ సింగ్. 2011లో పీపుల్స్ పార్టీ ఆఫ్ పంజాబ్లో చేరారు. 2012లో లెహ్రా అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2014లో ఆప్లో జాయిన్ అయ్యారు.
పంజాబ్ సీఎం అభ్యర్ధిగా ఎవరిని ప్రకటించాలనే సర్వే చేసినప్పుడు.. భగవంత్ మాన్కు 93 శాతం మంది మద్దతు తెలిపారు. వాట్సాప్, మిస్డ్కాల్, ఎస్ఎంఎస్లలో భగవంత్ మాన్కే ఓటు వేశారు. అప్పుడే దాదాపుగా విజయం ఖాయమైపోయింది. ఇక రాజకీయంగానూ భగవంత్ మాన్కు క్లీన్ చిట్ ఉంది. ఏనాడూ అవినీతి ఆరోపణలు ఎదుర్కోలేదు. పైగా మాల్వా ప్రాంతంలో భగవంత్ను సన్ ఆఫ్ సాయిల్ అని పిలుచుకుంటారు.
పంజాబీ స్టాండప్ కమెడియన్గా గుర్తింపు పొందిన భగవంత్ మాన్.. 2014లో ఆమ్ఆద్మీ పార్టీలో చేరారు. 2014, 2019లో సంగ్రూర్ ఎంపీగా గెలిచారు. ఎంపీగా వరుసగా రెండుసార్లు గెలిచినప్పటికీ.. ఆస్తులు తరుగుతూ వచ్చాయి తప్ప పెంచుకోలేదు. ఎన్నికల ప్రచారంలో భగవంత్మాన్పై ప్రత్యేకంగా చేసిన విమర్శ ఏంటంటే.. అతనో తాగుబోతు అని. రోజు డ్రగ్స్ తీసుకుంటారని మాన్పై ఆరోపణలు చేశారు.
కాని, ఈ విమర్శలకు చాలా సున్నితమైన సమాధానం చెప్పారు. మందు తాగడం మానేశానని, పంజాబ్ సీఎంగా బాధ్యతగా మసలుకుంటానని ప్రజలకు ప్రామిస్ చేశారు. దీన్ని పంజాబ్ ప్రజలు స్వీకరించారు. ఆమ్ఆద్మీ పార్టీకి లోక్సభలో ఉన్న ఏకైక ఎంపీ భగవంత్ మాత్రమే. ఎంపీగా సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ.. రైతులకు న్యాయం చేయాలంటూ లోక్సభలో పోరాడారు. రైతుల ఓట్లు సాధించడంలో కీలకంగా వ్యవహరించారు.