Bihar Elections 2025: పోటీ నుంచి తప్పుకున్న జేఎంఎం! 143 మంది అభ్యర్థులను ప్రకటించిన ఆర్జేడీ
బీహార్ ఎన్నికల్లో పెద్ద ట్విస్ట్..
బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇటీవల రాష్ట్రంలో ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన జేఎంఎం పార్టీ తాజాగా పోటీ నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయంపై హేమంత్ సొరెన్ నేతృత్వంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) పార్టీ నాయకులు మాట్లాడుతూ.. ప్రతిపక్ష మహాఘట్బంధన్ కూటమిలో భాగమైన కాంగ్రెస్, ఆర్జేడీ తమకు సీట్లు దక్కకుండా చేసిన రాజకీయ కుట్ర కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్లు దాఖలు చేయడానికి ఈరోజు చివరిది. నామినేషన్ల గడువు మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. ఈ క్రమంలో JMM మహా కూటమిపై తీవ్రమైన ఆరోపణలు చేసింది. కూటమిలో రాజకీయ అవకతవకలు జరిగాయని, ఫలితంగా తమ పార్టీ బీహార్ ఎన్నికల నుంచి వైదొలగాలని నిర్ణయించుకుందని వెల్లడించింది. మహా కూటమి చర్యలతో అసంతృప్తి చెందిన జేఎంఎం పార్టీ ఇకపై రాష్ట్రంలో ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వబోమని స్పష్టం చేసింది.
మహా కూటమి తమ హక్కులను గౌరవించి, తమ భాగస్వామ్యాన్ని గౌరవించి ఉంటే, పరిస్థితి ఇప్పుడు భిన్నంగా ఉండేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో తమకు మద్దతు ఇవ్వకపోవడం వల్ల కలిగే పరిణామాలను మహా కూటమి ఎదుర్కొంటుందని హెచ్చరించారు. ఈ నిర్ణయం బీహార్లో కొత్త రాజకీయ పరిణామాలకు దారి తీస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.
ఈ నేపథ్యంలో జేఎంఎం సీనియర్ నాయకుడు సుదివ్య కుమార్ మాట్లాడుతూ.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీ కలిసి జేఎంఎంకు అన్యాయం చేశాయని విమర్శించారు. ఈ పరిణామాలకు జార్ఖండ్లో కాంగ్రెస్, ఆర్జేడీలతో పొత్తును పార్టీ సమీక్షిస్తుందని పేర్కొన్నారు. తగిన సమయంలో ఈ రెండు పార్టీలకు కచ్చితమైన సమాధానం ఇస్తామని ఆయన వెల్లడించారు.
ఆర్జేడీ 143 మంది అభ్యర్థులను ప్రకటించడంతో మహఘఠ్బంధన్లో సీట్ల పంపకాలు కూడా ఓ కొలిక్కి వచ్చినట్లేనని అనుకోవాలి. ఆర్జేడీ 143, కాంగ్రెస్ 55, సీపీఐఎంఎల్ 20, సీపీఐ 6, సీపీఎం 4, వీఐపీ 15 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ 60 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించడంతో కొన్ని చోట్ల విపక్ష కూటమిలోని పార్టీల మధ్య పోటీ తప్పడం లేదు. బీహార్లో తొలివిడుత నామినేషన్ల గడువు అక్టోబర్ 17న ముగిసింది. అదేవిధంగా రెండో విడతకు సోమవారమే చివరి రోజు. నవంబర్ 6, 11వ తేదీల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అదే నెల 14న ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు.