ఎన్నికల షెడ్యూల్ వెలువడకముందే లోక్సభకు అభ్యర్థులను ప్రకటించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. మొదటి విడతలో 160 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించనుంది. ఇందులో తెలంగాణాలోని 12 లోక్సభ నియోజకవర్గాలు కూడా ఉన్నాయట. లోక్సభకు డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు జరగుతాయని రాజకీయ పార్టీల్లో జోరుగా చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికల ఊహాగానాల నేపథ్యంలో.. బీజేపీ ముందస్తు అభ్యర్తుల ప్రకటన కసరత్తు ఆసక్తి రేపుతోంది.
160 నియోజకవర్గాల్లో బలహీనంగా ఉన్నామనే అంచనాతో.. చాలా కాలం నుండి ఆ స్థానాలపై బీజేపీ దృష్టి పెట్టింది. ముందుగా చాలా బలహీనంగా ఉన్న నియోజకవర్గాల అభ్యర్థులను ప్రకటింనుంది. ఎన్నికల షెడ్యూల్ రాకముందే మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికలకు.. ఇటీవల మొదటి జాబితాను బీజేపీ అధిష్టానం విడుదల చేసింది. బీజేపీ చరిత్రలో మొదటిసారిగా షెడ్యూల్ కన్నా ముందు అభ్యర్థుల ప్రకటించింది. అలా చేయడం వల్ల అభ్యర్థుల విజయవకాశాలు మెరుగవుతాయని అంచనా వేస్తున్నారు. లోక్సభ ఎన్నికలకు ముందస్తు అభ్యర్థుల ప్రకటన వ్యూహాన్ని అమలు చేసేందుకు కమలనాథులు సిద్ధమయ్యారు.
ఇప్పటికే.. 160 లోక్సభ నియోజక వర్గాల్లో ప్రవాస్ కార్యక్రమం పూర్తయ్యింది. ఆయా నియోజకవర్గాల్లో విస్తృ తంగా పర్యటించి.. కేంద్ర మంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు.. రూపొందించిన నివేదికలపై ఈ వారంలో ఆ పార్టీ ముఖ్యులు సమీక్షించనున్నారు.