చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వ్యక్తులకు, వారికి అర్థమయ్యేలా, వారి భాషలోనే సమాధానం ఇస్తామని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హెచ్చరించారు. ఇలాంటి వారిపట్ల బుల్డోజర్ న్యాయాన్ని సమర్థించుకున్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారం చేపట్టిన 2017 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మతపరమైన అల్లర్లు జరగలేదని తెలిపారు. భారత్ లో ఇస్లాం ప్రమాదంలో లేదని, ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే ప్రమాదంలో ఉన్నాయని విమర్శించారు. హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమనే విషయం గుర్తించుకోవాలని సూచించారు. పాకిస్థాన్, బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులపై యూపీ సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. "సంబల్లో అన్ని చోట్ల తవ్వి ఆలయాలను గుర్తిస్తాం.. ఎన్ని ఉంటే అన్ని వెతుకుతాం.. అన్ని బయటికి తీస్తాం.. దేవుడు ఇచ్చిన కళ్లతో సంబల్లో ఏం జరిగిందో చూడాలని ప్రపంచాన్ని కోరుతాం. ఏ రోజైతే భారతీయ ముస్లింలు తమ పూర్వీకులను అర్థం చేసుకుంటారో, ఆ రోజు నుంచి వారిని ఆడించేవారి ఆటలు సాగవు. తమ ఉనికిని కాపాడుకునేందుకు కొందరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంటారు. హిందువులు సురక్షితంగా ఉన్నప్పుడే భారతీయ ముస్లింలు సురక్షితమని గుర్తించుకోవాలి" అని అన్నారు.