Telecom Services: త్వరలో అందుబాటులోకి ఇంట్రా సర్కిల్ రోమింగ్
జియో, ఎయిర్టెల్, బీఎస్ఎన్ఎల్ మధ్య ఇంట్రా సర్కిల్ రోమింగ్;
గ్రామీణ, మారుమూల ప్రాంతాలకు వెళ్లినప్పుడు మొబైల్ సిగ్నల్ లేకపోవడం చాలా ఇబ్బంది పెడుతుంది. మనం వాడే నెట్వర్క్ కాకు ండా వేరే నెట్వర్క్ సిగ్నల్ ఉన్నా మనం వినియోగించుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు ఈ సమస్యకు పరిష్కారం లభించనుంది. ఇందుకు వీలు కల్పించే ఇంట్రా సర్కిల్ రోమింగ్(ఐసీఆర్) సర్వీస్ను కేంద్ర టెలికం శాఖ జనవరి 17న ప్రారంభించింది. గ్రామీణ ప్రాంతాల్లో మొబైల్ నెట్వర్క్ను విస్తరించేందుకు ప్రభుత్వం డిజిటల్ భారత్ నిధి(డీబీఎన్) అనే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఇందులో భాగంగా 35 వేల గ్రామాలకు మొబైల్ నెట్వర్క్ ఉండేలా 27 వేల మొబైల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నది. ఇప్పటివరకు డీబీఎన్ నిధులతో ఏ కంపెనీ అయితే టవర్ను ఏర్పాటు చేస్తుందో ఆ కంపెనీ వినియోగదారులకు మాత్రమే సిగ్నల్ అందేది. ఇప్పుడు ప్రారంభించిన ఐసీఆర్ ద్వారా డీబీఎన్ నిధులతో ఏర్పాటైన టవర్లను బీఎస్ఎన్ఎల్, జియో, ఎయిర్టెల్ సంస్థలు సంయుక్తంగా వినియోగించుకుంటాయి. తద్వారా ఈ కంపెనీల వినియోగదారులందరికీ మారుమూల ప్రాంతాల్లోనూ 4జీ మొబైల్ నెట్వర్క్ అందుతుంది. డీబీఎన్ టవర్ల పరిధిలో మనం వాడే నెట్వర్క్ సిగ్నల్ లేకపోతే మన ఫోన్ ఆటోమెటిక్గా అక్కడ ఉండే నెట్వర్క్కు మారిపోయే సదుపాయం కూడా రానున్నది.