రాష్ట్ర ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన చంద్రబాబు... దిల్లీలో మళ్లీ కీలకంగా మారారు. కేంద్రంలో కొత్త ఏర్పాటులో ముఖ్య భూమిక పోషించే స్థితిలో మరోసారి నిలిచారు. అందుకే... దిల్లీ చేరుకోగానే... ఆయన ఏం చెబుతారోనని... జాతీయ మీడియా ఆసక్తి కనబరిచింది. లోక్సభ స్పీకర్, కేంద్ర మంత్రి పదవులపై మీడియా ఎన్నిసార్లు ప్రశ్నించినా... తెదేపా అధినేత పెదవి విప్పలేదు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు దాదాపు 3 దశాబ్దాల తర్వాత.. మళ్లీ దిల్లీలో కీలకంగా మారారు. ఈ నెల 4న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో ఎన్డీయే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీగా తెలుగుదేశం అవతరించడం, కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆ పార్టీ మద్దతు అవసరమవడంతో... జాతీయ మీడియా మొత్తం చంద్రబాబు వైపు మోహరించింది. బుధవారం ఎన్డీయే సమావేశంలో పాల్గొనడానికి దిల్లీకి వచ్చిన చంద్రబాబును ఎయిర్పోర్టులో కాలు పెట్టినప్పటినుంచి తిరిగి వెళ్లేంతవరకూ అనుసరించింది. భాజపా ఎక్కువ లోక్సభ స్థానాల సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ... మెజారిటీ మార్కు 272కు ఇంకా 32 సీట్ల దూరంలో నిలిచిపోవడంతో... మిత్రపక్షాల మద్దతు మోదీకి అనివార్యమైంది. గత రెండు పర్యాయాలూ సొంత మెజారిటీతో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన ఆయనకు చంద్రబాబు, నీతీశ్కుమార్ లాంటి వారి మద్దతు ఇప్పుడు అనివార్యం కావడంతో జాతీయ మీడియా మొత్తం వీరిద్దరిపైనే దృష్టిసారించి.. వారు ఏం చెబుతారా అని ఆసక్తిగా ఎదురుచూసింది.
గతంలో యునైటెడ్ ఫ్రంట్ నేతృత్వంలో దేవేగౌడ, ఐకే గుజ్రాల్ ప్రభుత్వాల ఏర్పాటులో, 1998, 1999లో వాజపేయీ హయాంలో ఎన్డీయే ప్రభుత్వ ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించారు. వాజపేయీ హయాంలో రాష్ట్రపతిగా అబ్దుల్కలాంను ప్రతిపాదించడంలోనూ ముఖ్యభూమిక ఆయనదే. ప్రాంతీయపార్టీగా ఉన్నప్పటికీ 1984లో లోక్సభలో ప్రధానప్రతిపక్ష పాత్ర పోషించిన తెలుగుదేశం ఆ తర్వాత నుంచి అవసరం వచ్చిన ప్రతిసారీ ఏదో రూపంలో జాతీయపార్టీలతో సమానంగా దిల్లీలో కీలకపాత్ర పోషిస్తూ వచ్చింది. వీపీసింగ్, దేవేగౌడ, ఐకే గుజ్రాల్, వాజపేయీ, మోదీ మొదటిదఫా ప్రభుత్వ ఏర్పాటులో భాగస్వామిగా ఉంది. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం మనుగడ సాగించడంలోనూ తెదేపాదే ప్రధాన భూమిక.
2024 ఎన్నికల ముంగిట కలిసి కూటమిగా ఏర్పడి ఏపీలో ప్రభంజనం సృష్టించడంతోపాటు, కేంద్రంలో కీలకభూమిక పోషించే స్థాయిలో ఎంపీ స్థానాలను తెదేపా గెలుచుకుంది. చంద్రబాబు ఎన్డీయే కూటమిలో కొనసాగుతారా? ఇండియా కూటమి ఏదైనా మంచి ప్రతిపాదన చేస్తే అటువైపు మళ్లుతారా అన్న చర్చ దిల్లీ స్థాయిలో తీవ్రంగా జరగడంతో ఆ విషయంపై స్పష్టత కోసం జాతీయ మీడియా ప్రతినిధులు మొత్తం ఆయన చుట్టూ మూగిపోయారు. ఆయనతో సెల్ఫీలు దిగేందుకు మీడియా ప్రతినిధులు పోటీపడ్డారు. ఎవరు ఎన్ని ప్రశ్నలు వేసినా ఆయన మాత్రం తాను ఎన్డీయేలోనే కొనసాగుతానని, అందులో అనుమానాలు అవసరం లేదని స్పష్టంచేశారు. అలాగే లోక్సభ స్పీకర్ పదవితో పాటు ఎక్కువ మంత్రి పదవులను తెదేపా అడుగుతోందన్న అంశంపై పాత్రికేయులు ఎన్నిసార్లు ప్రశ్నించినా ఆయన పెదవి విప్పలేదు.
మరోవైపు... ప్రధానమంత్రి నివాసంలో జరిగిన ఎన్డీయే కూటమి సమావేశంలోనూ భాజపా నేతలు చంద్రబాబుకు పెద్దపీట వేశారు. ప్రధానమంత్రికి ఒకవైపు భాజపా అగ్రనేతలు కూర్చుంటే, మరోవైపు చంద్రబాబు, నీతీశ్కుమార్లు కూర్చున్నారు. ప్రధానితో చంద్రబాబు, నీతీశ్లు సరదాగా మాట్లాడుకుంటూ గత అనుభవాలను పంచుకుంటూ నవ్వుతున్న దృశ్యాలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. సమావేశం ప్రారంభానికి ముందు జేపీ నడ్డా, అమిత్షాలు చంద్రబాబుతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ తర్వాత పీయూష్గోయల్తో చర్చలు జరిపారు. అనంతరం తెలంగాణభవన్లో ఆ రాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్తో అరగంటపాటు చర్చించారు. గతంలో యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పాటు ఏపీభవన్ కేంద్రంగా జరిగిన ఉదంతాన్ని అప్పట్లో ప్రత్యక్షంగా చూసిన పాత్రికేయులు గుర్తుచేసుకుంటున్నారు. మళ్లీ ఇప్పుడు చంద్రబాబుకు అదే స్థాయి ప్రాధాన్యం వచ్చి జాతీయ రాజకీయాల్లో కేంద్ర బిందువుగా మారినట్లు పలువురు వ్యాఖ్యానించారు.