Haryana Jalabhishek Yatra : హర్యానాలో జలాభిషేక యాత్ర పూర్తి.. ఇంటర్నెట్ సేవలు రీస్టార్ట్
హర్యానాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్రలో భాగంగా నుహ్ జిల్లాలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఇంటర్నెట్ సేవలు ఆదివారం సాయంత్రం 6.00 గంటల నుంచి సోమవారం సాయంత్రం 6.00 గంటల వరకు నిలిపివేశారు. వాటిని సోమవారం సాయంత్రం పునరుద్ధరించారు. ఈ మేరకు ఆ రాష్ట్ర అడిష నల్ చీఫ్ సెక్రటరీ అనురాగ్ రస్తోగి ఓ ప్రకటన రిలీజ్ చేశారు.
యాత్ర కొనసాగుతున్న వేళ.. సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేయకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకున్నట్లు వివరించారు. అలాగే నుహ్ జిల్లాలో బ్రజ్ మండల్ జలాభిషేక యాత్ర శాంతియుతంగా జరిగేలా పటిష్టమైన చర్యలు తీసుకున్నాన్నామని తెలిపారు. అందు కోసం తగిన భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. గతేడాది జులై 31న నుహ్ జిల్లాలో విశ్వహిందూ పరిషత్ ఊరేగింపును అపేందుకు పలువురు ప్రయత్నించారు. ఆ క్రమంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దాంతో ఆందోళనకారులు రాళ్లు రువ్వడంతో పాటు కార్లను సైతం తగులబెట్టారు. ఈ హింసలో ఇద్దరు హోంగార్డులు మరణించారు. మరో 17 మంది తీవ్రంగా గాయపడ్డారు.
అదే రోజు రాత్రి గుర్గావ్ లో మసీదుపైనా ఆగంతకులు దాడి చేసి.. ఇమామ్ ను హత్య చేశారు. ఆ తర్వాత చోటు చేసుకున్న మత ఘర్షణలో అయిదుగురు మరణించారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. గతే డాది చోటు చేసుకున్న పరిస్థితులు పునరావృతం కాకుండా హర్యానా ప్రభుత్వం భారీ బందోబస్తును ఏర్పాటు చేసింది.