Opposition Parties : పార్లమెంట్ ను సమావేశపర్చండి.. ప్రధానికి 16 విపక్ష పార్టీల లేఖ

Update: 2025-06-04 09:30 GMT

ఆపరేషన్ సిందూర్ పై ప్రత్యేక పార్లమెంట్ సమావేశం ఏర్పాటు చేయాలని 16 విపక్ష పార్టీలక చెందిన ఎంపీలు డిమాండ్ చేశారు. ప్రధాని నరేంద్ర మోడీకి మంగళవారం లేఖరాశారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్లో సమా వేశమైన విపక్షపార్టీల నేతలు (ఇండియా కూటమి) పార్లమెంట్ సమావేశం గురించిన అంశంపై చర్చించారు. ప్రత్యేక సెషన్ కోసం ప్రధానికి లేఖ రాయాలని నిర్ణయించారు. అనంతరం కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ, సమాజ్ వాదీ పార్టీ, శివసేన - యూబీటీ ఎంపీల సంతకాలతో ప్రధానికి లేఖ రాశారు. కరుణానిధి జయంతి సందర్భంగా సమావేశానికి హాజరు కాలేకపోయిన డీఎంకే ప్రతినిధులు కూడా ఈ లేఖపై సంతకం చేశారు. కాంగ్రెస్ నుంచి జైరాం రమేశ్, దీపకుడా, టీఎంసీ నుంచి డెరెక్ ఒబ్రెయిన్, సమాజ్వాది పార్టీ నుంచి రామ్ గోపాల్ యాదవ్, ఆర్జేడీ నుంచి మనోజ్ ఝా, శివసేన నుంచి సంజయ్ రౌత్ తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. నేషనల్ కాన్ఫరెన్స్, సీపీఎం, ఏయూఎంఎల్, ఆరెస్పీ, వీసీకే, కేరళ కాంగ్రెస్, ఎండీఎంకే, సీపీఐఎంల్ పార్టీ ఎంపీలు కూడా ప్రధానికి రాసిన లేఖపై సంతకాలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీ విపక్ష నేతల సమావేశానికి గైర్హాజరైంది. కానీ నేరుగా ప్రధాని మోడీకి లేఖ రాస్తామని తెలిపింది.

పహల్గాం దాడిపై ప్రత్యేక పార్లమెంటు సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని లేఖలో ఎంపీలు డిమాండ్ చేశారు. ఇండియా కూటమిలో భాగమైన ఎన్సీపీ ఈ సమావేశానికి దూరంగా ఉంది. పహల్గాం దాడి, ఆపరేషన్ సిందూర్ పై వివరించేందుకు అఖిలపక్ష ఎంపీలు వివిధ దేశాలకు వెళ్లినందున వారు తిరిగి వచ్చిన తర్వాత జూన్లోనే ప్రత్యేక సమావేశం నిర్వహించాలని, పహల్గాం ఉగ్రదాడి, తదనంతర పరిణామాలపై చర్చించాలని, ఈ అంశంపై దేశ ప్రజలకు పార్లమెంట్ వేదికగా స్పష్టత ఇవ్వాలని టీఎంసీ డిమాండ్ చేసింది.

Tags:    

Similar News