Building Collapse: ఢిల్లీలో కుప్పకూలిన నాలుగు అంతస్తుల భవనం!
శిథిలాల కింద చిక్కుకున్న నివాసితులు;
దేశ రాజధాని ఢిల్లీలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. శనివారం ఉదయం 7 గంటల సమయంలో నార్త్ ఈస్ట్ ఢిల్లీలోని జనతా మజ్దూర్ కాలనీలో నాలుగు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో భవనంలో నివాసం ఉండే వారు శిథిలాల కింద చిక్కుకుపోయారు. స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగాయి. ఇప్పటి వరకు నలుగురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయాలైన వారిని చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.
భవనం శిథిలాలలో 12 మంది చిక్కుకున్నారని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది, రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పోలీసులు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. శిథిలాల కింద మరికొంత మంది చిక్కుకున్నట్లు ఒక సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. ‘ఉదయం 7 గంటలకు భవనం కూలిపోయినట్లు మాకు కాల్ వచ్చింది. ఏడు అగ్నిమాపక దళాలు సహా బహుళ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది’ అని సదరు అధికారి చెప్పారు.