అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) నేతృత్వంలోని ఢిల్లీ (Delhi) ప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరానికి తన 10వ వార్షిక బడ్జెట్ను నేడు (మార్చి 4) సమర్పించనుంది. మూలాల ప్రకారం ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వ బడ్జెట్ "రామరాజ్యం" భావనపై ఆధారపడి ఉందనుందని తెలుస్తోంది.
ఢిల్లీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 15న ప్రారంభమయ్యాయి. ఇవి ఫిబ్రవరి 21తో ముగియాల్సి ఉండగా.. మార్చి మొదటి వారం వరకు పొడిగించారు. గత ఏడాది మార్చిలో మంత్రివర్గంలోకి ప్రవేశించిన ఢిల్లీ ఆర్థిక మంత్రి అతిషి.. ఈరోజు తన మొదటి బడ్జెట్ను సమర్పించనున్నారు.
రామరాజ్యం ఆధారంగా ఢిల్లీ బడ్జెట్
ఎన్నికల సంవత్సరంలో బడ్జెట్లో సమాజంలోని ప్రతి వర్గానికి ఏదో ఒక ప్రయోజనం ఉండే అవకాశం ఉందని ఆప్ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఏప్రిల్-మేలో లోక్సభ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.‘ఈసారి బడ్జెట్ రామరాజ్యం కాన్సెప్ట్పై ఆధారపడి ఉంటుంది. ఇది ఆప్కి చెందిన 10వ బడ్జెట్. రామ్ సూత్రాలకు అనుగుణంగా సమాజంలోని ప్రతి వర్గానికి బడ్జెట్లో కేటాయింపులు ఉండే అవకాశం ఉంది" అని ఒక ఓ నివేదిక తెలిపింది. ఇటీవలి కాలంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తరచుగా "రామరాజ్యం" గురించి మాట్లాడుతున్నారు. తన రిపబ్లిక్ డే ప్రసంగంలోనూ, AAP ప్రభుత్వం నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలు, ప్రజలకు ఉచిత విద్యుత్, నీరు, మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా "రామరాజ్యం" 10 సూత్రాలను ఆమోదించిందని ఆయన పేర్కొన్నారు.