Sabarimala: శబరిమలకు రికార్డు స్థాయిలో భక్తులు

ఒకే రోజు 5.75లక్షల మందికి అయ్యప్ప దర్శనం..

Update: 2025-11-23 04:45 GMT

కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మండలం, మకరవిలక్కు వార్షిక ఉత్సవాల నేపథ్యంలో భక్తులు తరలివస్తున్నారు. తొలివారంలోనే ఏకంగా 5.75లక్షల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకున్నట్లుగా అధికారులు వెల్లడించారు. తాజాగా శనివారం సాయంత్రం 7 గంటల వరకు దాదాపు 72వేల మందికిపైగా శబరిమలకు చేరినట్లుగా అధికారులు చెప్పారు. భక్తుల తాకిడి కొనసాగుతుందని.. అయితే, అడపాదడపా వర్షాలు కురుస్తున్నా ఎలాంటి ఆటంకాలు లేకుండా శబరిమల యాత్ర కొనసాగుతుందని, భక్తులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భక్తుల కోసం క్యూ షెల్టర్ల వద్ద ఎక్కువ సేపు నిరీక్షించాల్సిన అవసరం లేకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఇదిలా ఉండగా.. భక్తుల రద్దీ నేపథ్యంలో ఏర్పాట్లపై మంత్రి వీఎన్‌ వాసవన్‌ ట్రావెన్‌ కోర్‌ దేవస్వం బోర్డు అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పంపలో నిర్వహించిన ఈ సమావేశంలో రద్దీకి అనుగుణంగా స్పాట్‌ బుకింగ్‌ను రద్దుబాటు చేయాలని నిర్ణయించారు. ఎక్కువ మంఇ భక్తులకు దర్శనాలు కల్పించేందుకు వీలుగా 18 మెట్లను ఎక్కే భక్తుల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రస్తుతం నిమిషానికి 75 మంది మెట్లను ఎక్కుతుండగా.. ఈ సంఖ్యను 85కి పెంచాలని చెప్పారు. గత సంవత్సరం ఈ సీజన్‌లో 53.6 లక్షల మంది అయ్యప్ప భక్తులు శబరిమలను సందర్శించారు. ఈ సారి ఈ సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. అంచనా ప్రకారం.. నవంబర్‌ 16 నుంచి సీజన్‌ మొదలు కాగా.. దాదాపు ఇప్పటి వరకు 5లక్షల మందికిపైగా అయ్యప్పను దర్శించుకున్నారు. నీలక్కల్-పంప సేవల్లో కేరళ ఆర్టీసీకి రోజువారీ ఆదాయం రూ.60లక్షలు పెరిగింది. సన్నిధానంలో దర్శన సమయాలపై టీడీబీ సమగ్ర సంప్రదింపుల తర్వాత తుది నిర్ణయం తీసుకుంటుంది.

సన్నిధానం ఆరోగ్య కేంద్రంలో ఎకోకార్డియోగ్రామ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఆరోగ్య శాఖకు సూచించారు. పంప, నీలక్కల్‌లలో పనిచేస్తున్న పోలీసు బృందాల మధ్య మెరుగైన సమన్వయం అవసరమని కూడా నొక్కి చెప్పింది. పంపా వద్ద ఉన్న ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. నీలక్కల్‌లో పార్కింగ్ సౌకర్యాలను పూర్తిగా ఉపయోగించుకునేలా తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు. భక్తులకు రియల్‌ టైమ్‌ సమాచారం అందించేందుకు పంప, నీలక్కల్‌లో భారీ ఎల్‌ఈడీ డిస్‌ప్లే వాల్స్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. డిప్యూటీ కమాండర్ నేతృత్వంలోని 140 మంది సభ్యుల రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) యూనిట్ సన్నిధానం, మరకూట్టంలో మోహరించనున్నారు. మూడు షిఫ్టుల్లో 32 మంది సిబ్బంది పని చేస్తారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయం అందించేందుకు పది మంది సభ్యుల క్విక్‌ రెస్పాన్స్‌ టీమ్‌ 24 గంటల పాటు సిద్ధంగా ఉంటుంది.

Tags:    

Similar News