Elon Musk: అయోధ్య రామాలయం అద్భుతం – ఎలాన్ మస్క్ తండ్రి
బాలరాముడిని దర్శించుకున్న ఎరోల్ మస్క్;
టెక్ దిగ్గజం, స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధినేత, బిలియనీర్ ఎలాన్ మస్క్ తండ్రి ఎరోల్ మస్క్ ఉత్తరప్రదేశ్ లోని అయోధ్య రామమందిరాన్ని దర్శించుకున్నారు. ఆయన ఈనెల 1న ఇండియాకు వచ్చారు. భారతీయ సంప్రదాయ కుర్తా పైజామా ధరించి, గర్భాలయంలో బాలరాముడికి ప్రత్యేక పూజలు చేశారు.
అయోధ్యలోని హనుమాన్ గార్హీ ఆలయాన్ని కూడా ఎరోల్ మస్క్ దర్శించుకున్నారు. ఆయన వెంట కుమార్తె అలెగ్జాండ్ర మస్క్ కూడా ఉన్నారు. సర్వోటెక్ రెన్యూవబుల్ పవర్ సిస్టమ్స్ లిమిటెడ్ కు ఎరోల్ మస్క్ గ్లోబల్ అడ్వైజర్ గా పనిచేస్తున్నారు. ఎరోల్ మస్క్ రాక సందర్భంగా ఆలయ పరిసరాల్లో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆయన ఈనెల 6వ తేదీ వరకు భారత్లోనే ఉంటారని సమాచారం. అయితే, అయోధ్య ఆలయాన్ని దర్శించుకున్న తరువాత ఎరోల్ మస్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అయోధ్య రామాలయ దర్శనం చాలా అద్భుతమైన, మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది. నేను ఇప్పటి వరకు చేసిన గొప్ప పనుల్లో ఇది ఒకటి. చాలా సంతోషంగా ఉంది. ఈ ఆలయం చాలా అందంగా ఉంది. ప్రపంచంలోనే ఇది అద్భుతమైన దేవాలయం అవుతుందంటూ ఎరోల్ మస్క్ పేర్కొన్నారు. భారతదేశంలో నా పర్యటన అద్భుతంగా సాగుతుంది. సర్వోటెక్ తో కలిసి పనిచేయడం ప్రారంభించడానికి నేను ఇక్కడ ఉన్నాను. దేశంలో ఎక్కువ సమయం గడపాలని ఎదురు చూస్తున్నాను. దేవాలయాలు అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడి ప్రజలు కూడా అంతే అద్భుతంగా ఉన్నారు అంటూ ఎరోల్ మస్క్ అన్నారు.