బిహార్ మాజీ సీఎం, దివంగత నేత కర్పూరి ఠాకూర్ (Karpoori Thakur) కు ఇటీవలే దేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారతరత్న'ను ప్రకటించిందింది కేంద్రం. ఈసారి ముందెన్నడూ లేనిరీతిలో ఐదుగురికి భారతరత్న ప్రకటించడం సంచలనంగా మారింది. కర్పూరి ఠాకూర్ కుటుంబ సభ్యులు.. ప్రధాని నరేంద్ర మోడీని (PM Modi) మర్యాదపూర్వకంగా కలిశారు.
ఢిల్లీలోని ప్రధానమంత్రి నివాసంలో.. ఠాకూర్ కుటుంబం మోడీతో భేటీ అయింది. పీఎంఓ ఆహ్వానంతో వారు మంగళవారం ప్రధానిని కలిసేందుకు వచ్చారు. ఠాకూర్ కుమారుడు, జేడీ(యూ) నేత రామ్నాథ్ ఠాకూర్ సహా కుటుంబ సభ్యులతో మోడీ మాట్లాడారు. తన తండ్రిని 'భారత రత్న'తో గౌరవించినందుకు ప్రధానికి రామ్నాథ్ కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి ఇది మరో దీపావళి అని ఆయన చెప్పారు.
కర్పూరి ఠాకూర్ జన నాయకుడనీ.. ఆయన కుటుంబాన్ని కలవడం ఎంతో సంతోషంగా ఉందని మోడీ చెప్పారు. సమాజంలోని వెనకబడిన తరగతులు, అణగారిన వర్గాలకు ఆయన అండగా నిలిచారని గుర్తు చేశారు. కర్పూరీ ఠాకూర్ జీవితం, ఆదర్శ సూత్రాలు దేశ ప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయని తెలిపారు.