Arvind Kejriwal : బెయిల్ స్టేపై సుప్రీంకోర్టుకు కేజ్రీవాల్, నేడే విచారణ
హైకోర్టు బెయిల్ పై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఢీల్లీ సీఎం;
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. విడుదలపై స్టే విధించాలన్న ఢిల్లీ హైకోర్టు నిర్ణయాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ ఈరోజు సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. న్యాయమూర్తులు ఎస్వీఎన్ భట్టి, మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.
నూతన ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను మార్చి 21న ఈడీ అరెస్టు చేసింది. మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ దిగువ కోర్టు తీర్పు ఇచ్చింది. బెయిల్ మంజూరును వ్యతిరేకిస్తూ.. ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఢిల్లీ హైకోర్టు బెయిల్ మంజూరుపై స్టే విధించింది. హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ ఉత్తర్వులు వచ్చే వరకు ఇంప్లీడ్ ఆర్డర్ అమలును వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.హైకోర్టు బెయిల్ పై స్టే విధించడాన్ని వ్యతిరేకిస్తూ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ట్రయల్ కోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. “బెయిల్ను వ్యతిరేకించేందుకు మాకు సరైన అవకాశం లభించలేదు. వెకేషన్ బెంచ్ మా వాదనలను వినిపించేందుకు సరిపడా సమయం ఇవ్వలేదు” అని ఈడీ తరఫు న్యాయవాది అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హైకోర్టుకు తెలిపారు. ట్రయల్ కోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తమ పిటిషన్పై అత్యవసర చర్యలు చేపట్టాలని పిటిషన్లో అభ్యర్థించారు. ఈ పిటిషన్ను స్వీకరించిన హైకోర్టు దీనిపై శుక్రవారమే విచారణ జరుపుతామని వెల్లడించింది. అప్పటివరకు ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులను అమలుచేయొద్దని ఆదేశాలు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ ప్రస్తుతానికి జైలు నుంచి విడుదలయ్యే అవకాశం లేకుండా పోయింది.