Faridabad: కోడలు పారిపోయిందని అత్తమామలు ఆరోపణ..కట్ చేస్తే ..
10 అడుగుల గుంతలో మృతదేహం లభ్యం;
హర్యానా రాష్ట్రంలోని ఫరీదాబాద్లో దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.కట్నం కోసం కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. కన్నవారికి దూరంగా, భర్తనే నమ్ముకుని అత్తారింట్లో కాలు పెట్టిన యువతిని ఆ అత్తింటివారే బలిగొన్నారు. వివాహితను హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి పక్కనే 10 అడుగుల లోతు గొయ్యిని తీసి పూడ్చిపెట్టారు. ఆ తర్వాత ఆమె ఇంట్లో నుంచి పారిపోయిందని, ఎక్కడికి వెళ్లిందో తెలియట్లేదని నాటకాలు ఆడారు. ఈ దారుణ ఘటన హరియాణాలోని ఫరీదాబాద్లో వెలుగుచూసింది. ఈ కేసులో మృతురాలి భర్త, అత్తమామ సహా నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ఇలా బయటపడింది..
ఫరీదాబాద్లోని రోషన్ నగర్లో నివసించే అరుణ్ అనే వ్యక్తికి ఉత్తరప్రదేశ్కు చెందిన తను (24) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. శుక్రవారం వారి ఇంటి పక్కనే ప్రజలు తిరిగే సందులో కొత్తగా వేసిన కాంక్రీట్ కింద కుళ్లిన స్థితిలో ఉన్న తను మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.మురుగునీటి కాలువ కోసం తవ్విన 10 అడుగుల లోతైన గొయ్యిలో ఆమె మృతదేహం కనపడింది. మృతదేహం పూర్తిగా కుళ్లిపోవడంతో దాన్ని బయటకు తీయడానికి పోలీసులు ఎక్స్కవేటర్ను ఉపయోగించాల్సి వచ్చింది. ఆమె మరణానికి గల కచ్చితమైన కారణాల తెలుసుకోవడం కోసం మృతదేహాన్ని ఫోరెన్సిక్ పరీక్షకు పంపారు.
మృతురాలు “తను” సోదరి ప్రీతి, తన చెల్లెలిని అత్తింటివారే కట్నం కోసం హత్య చేశారని ఆరోపిస్తోంది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. వివాహం జరిగిన కొన్ని రోజుల నుంచే భర్త అరుణ్, అతని తల్లిదండ్రులు బంగారు నగలు, డబ్బు కోసం తనును మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేశారు.
వేధింపులు తాళలేక తను దాదాపు ఏడాది పాటు పుట్టింట్లోనే ఉండిపోయింది. మళ్లీ అత్తారింటికి పంపించాక, కనీసం ఫోన్లో కూడా తమతో మాట్లాడనివ్వకుండా చేశారని ప్రీతి కన్నీరుమున్నీరైంది. ఏప్రిల్ 23న తను ఇంటి నుంచి పారిపోయిందని అత్తింటివారు తమకు కబురు పంపారని, కానీ అది నిజం కాదని ఆమె తెలిపింది.
డ్రైనేజీ నాటకం.. పసిగట్టిన స్థానికులు
ఈ హత్యను కప్పిపుచ్చడానికి నిందితులు “డ్రైనేజీ గొయ్యి” నాటకం ఆడారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఏప్రిల్ నెలలో తను మామ ఇంటికి సరైన డ్రైనేజీ వ్యవస్థ లేదని చెబుతూ ఇంటి పక్కన పెద్ద గొయ్యి తవ్వాడు. గొయ్యి తవ్విన వెంటనే దానిపై సిమెంట్ స్లాబ్ వేసి కప్పివేయడం వారికి అనుమానం కలిగించింది.
“గొయ్యి తవ్వడం అందరం చూశాం. మురుగునీటి కోసం అన్నారు. కానీ అప్పటినుంచి వాళ్ల కోడలు కనిపించలేదు. ఏదో జరిగిందని అనుకున్నాం కానీ, ఇంత దారుణం చేస్తారని ఊహించలేదు” అని స్థానికులు తెలిపారు.
నలుగురి అరెస్ట్..
బాధితురాలి కుటుంబం నుంచి వారం క్రితం ఫిర్యాదు అందగానే చర్యలు తీసుకున్నామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (సెంట్రల్) ఉషా కుండు తెలిపారు. “ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికితీశాం. తను భర్త, మామ, అత్త, మరో బంధువు సహా నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాం. కేసును క్షుణ్ణంగా దర్యాప్తు చేస్తున్నాం” అని ఆమె వెల్లడించారు.