Corona Virus : 5 వేలకు చేరువలో కోవిడ్ కేసులు.. ఒక్కరోజే 564 మందికి పాజిటివ్..
5 నెలల చిన్నారి సహా ఏడుగురు మృతి;
గతకొన్ని రోజులుగా భారత్లో కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజాగా గత 24 గంటల్లో 500కిపైగా కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో ఈ ఏడాది కరోనా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 5 వేలకు చేరువైంది.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం.. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకూ కొత్తగా 564 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,866కి పెరిగింది. అత్యధికంగా కేరళలో 1,487 కేసులు వెలుగు చూడగా.. ఢిల్లీలో 562, పశ్చిమ బెంగాల్లో 538, మహారాష్ట్రలో 526, గుజరాత్లో 508, కర్ణాటకలో 436, తమిళనాడులో 213 కేసులు నమోదయ్యాయి.అయితే కొత్త వైరస్ వేగంగా వ్యాప్తిస్తుందని.. అలాగే చాలా మార్పులు చెందుతోందని.. కాకపోతే తేలికపాటి అనారోగ్యాన్ని కలిగిస్తుందని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) నిర్ధారించింది. సాధారణ లక్షణాలు జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, అలసట, తలనొప్పి, శరీర నొప్పులు, ముక్కు కారటం, ఆకలి లేకపోవడం, కాలానుగుణ ఫ్లూ మాదిరిగానే ఉంటుందని తెలిపింది.
గత 24 గంటల్లో ఏడు మరణాలు సంభవించాయి. ఢిల్లీలో 5 నెలల చిన్నారి సహా ఇద్దరు మరణించారు. కర్ణాటకలో ఇద్దరు, మహారాష్ట్రలో ముగ్గురు కొవిడ్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకూ కరోనా వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 51కి పెరిగింది. ఇక ఈ ఏడాది ఇప్పటి వరకూ 3,955 మంది డిశ్చార్జ్ అయ్యారు.