INVESTS INDIA: పశ్చిమ దేశాల వనరుల గమ్యస్థానంగా భారత్
భారత్ భారీ ఆర్థికవృద్ధిని చూస్తోందన్న ఐరాస ఆర్థిక నిపుణుడు హమీద్... చైనాకు విదేశీ పెట్టుబడులు తక్కువగా వెళ్తున్నాయని వెల్లడి;
పశ్చిమ దేశాల సంస్థల వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ మారిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. విదేశీ పెట్టుబడుల విషయంలో చైనా కన్నా భారత్ మెరుగ్గా ముందుకెళుతోందని ఐక్యరాజ్య సమితికి చెందిన నిపుణుడు వెల్లడించారు. ఇదే సమయంలో పాశ్చాత్య దేశాలతోపాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలా వరకు తగ్గినట్లు పేర్కొన్నారు.
భారత్ గణనీయమైన ఆర్థికవృద్ధిని చూస్తోందని ఐక్యరాజ్య సమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల విభాగం నిపుణుడు హమీద్ రషీద్ పేర్కొన్నారు. చైనాకు విదేశీ పెట్టుబడులు చాలా తక్కువగా నమోదవుతున్నాయని.. ఈ క్రమంలో అనేక పాశ్చాత్య దేశాల సంస్థల పెట్టుబడులకు భారత్ ప్రత్యామ్నాయ గమ్యస్థానంగా మారిందన్నారు. 2024 దేశ వృద్ధిరేటు అంచనాలను సవరించిన నేపథ్యంలో ఐరాస నిపుణుడు ఈ విషయంపై మాట్లాడారు. పాశ్చాత్య దేశాలతోపాటు విదేశాల నుంచి చైనాకు పెట్టుబడులు చాలావరకు తగ్గాయనీ.. ఇదే సమయంలో విదేశీ పెట్టుబడుల ప్రవాహంతో భారత్ ఎంతో లబ్ధి చెందుతోందని రషీద్ తెలిపారు. పశ్చిమదేశాల కంపెనీలకు వనరులు లేదా ప్రత్యామ్నాయ పెట్టుబడుల గమ్యస్థానంగా భారత్ మారడం వల్ల దేశానికి లబ్ధి చేకూరుతోందని పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక పరిస్థితి, అంచనాలు 2024కు సంబంధించి తాజా సవరణలను వెల్లడించిన ఆయన.. భారత ఆర్థికవృద్ధి రేటు 7 శాతానికి చేరువలో నమోదవుతుందని అంచనా వేశారు.
భారత్ వృద్ధి రేటు 2024లో 6.9శాతం, 2025లో 6.6 శాతంగా నమోదు చేసుకుంటుందని అంచనాలు ఉన్నాయి. ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగ సామర్థ్యం స్థిరంగా కొనసాగుతుండటం ఇందుకు దోహదం చేస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఔషధ, రసాయనాల ఎగుమతులు మరింత బలంగా విస్తరిస్తాయనీ. ద్రవ్యోల్బణం గణనీయంగా తగ్గిందని పేర్కొంటున్నారు. ఇతర దేశాల మాదిరిగా భారత ఆర్థికస్థితి కృత్రిమంగా కనిపించడం లేదనీ.. స్థిరవృద్ధికి అన్నివైపులా మద్దతు లభిస్తోందని హమీద్ రషీద్ తెలిపారు. నిజానికి గతేడాది నుంచే ఊపందుకున్న ఈ వృద్ధి క్రమంగా కొనసాగుతోందని వివరించారు. ముడిచమురు ధర విషయంతోపాటు దిగుమతుల కోసం రష్యాతో చేసుకున్న ఏర్పాట్లూ భారత్కు ఎంతో దోహదం చేస్తున్నాయని ఐరాస ప్రతినిధి పేర్కొన్నారు. భారత్తోపాటు బ్రెజిల్లోనూ బలమైన వృద్ధి రేటు చూశామన్నారు. చైనా వృద్ధి రేటును ఈ జనవరిలో 4.7శాతంగా అంచనా వేయగా.. తాజాగా అది స్పల్పంగా పెరిగి 4.8శాతంగా ఉండనుందన్నారు. పలు రంగాల్లో పెట్టుబడులు పెరిగే అవకాశం ఉన్నప్పటికీ అక్కడి ప్రాపర్టీ రంగం డ్రాగన్కు గణనీయమైన నష్టాన్ని కలిగిస్తోందన్నారు.