INDIA: భారత్ అణు శక్తి మరింత బలోపేతం
విశాఖ తీరంలో INS అరిఘాత్ నుంచి K-4 క్షిపణి సక్సెస్... సముద్ర గర్భం నుంచి అణు క్షిపణి ప్రయోగంలో భారత్ విజయం... 3,500 కి.మీ పరిధితో శత్రు లక్ష్యాల ధ్వంసం
భారత రక్షణ రంగం మరో అద్భుత మైలురాయిని అధిగమించింది. సముద్ర గర్భం నుంచి అణు దాడులు చేయగల సామర్థ్యాన్ని భారత్ ప్రపంచానికి చాటిచెప్పింది. స్వదేశీ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిఘాత్ (INS Arighaat) నుంచి అత్యంత శక్తివంతమైన 'కే-4' (K-4) బాలిస్టిక్ క్షిపణిని 2025 డిసెంబర్ 23న బంగాళాఖాతంలో విజయవంతంగా పరీక్షించారు. ఈ ప్రయోగంతో భారత్ తన 'అణు త్రయం' (సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో సుస్థిరం చేసుకుంది.
చైనాకు షాక్:
వాస్తవానికి ఈ ప్రయోగం డిసెంబర్ మొదటి వారంలోనే జరగాల్సి ఉంది. అయితే బంగాళాఖాతంలో చైనాకు చెందిన నిఘా నౌకలు సంచరిస్తుండటంతో, మన క్షిపణి సమాచారం శత్రువులకు చిక్కకుండా ఉండేందుకు DRDO, ఇండియన్ నేవీ అత్యంత గోప్యతను పాటించాయి. ఆ నౌకలు వెళ్ళిపోయిన వెంటనే, వ్యూహాత్మకంగా ఈ ప్రయోగాన్ని నిర్వహించి లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితత్వంతో ఛేదించాయి.
'కే-4' అమ్ములపొదిలో అజేయ శక్తి
ఈ క్షిపణికి క్షిపణి పితామహుడు ఏపీజే అబ్దుల్ కలాం గౌరవార్థం 'K' అని పేరు పెట్టారు. దీని ప్రత్యేకతలు.
3,500 కిలోమీటర్ల సుదూర లక్ష్యాలను ఛేదిస్తుంది. హిందూ మహాసముద్రం నుంచి ఆసియాలోని ప్రధాన ప్రాంతాలను గురిపెట్టవచ్చు. సుమారు 2 నుంచి 2.5 టన్నుల బరువున్న అణ్వాయుధాలను మోసుకెళ్లగలదు. నీటి లోపల సైలో (Silo) నుంచి బయటకు వచ్చి, ఉపరితలంపైకి చేరాక మోటార్లు మండి లక్ష్యం వైపు దూసుకెళ్తుంది. 12 మీటర్ల పొడవు, 17 టన్నుల బరువుతో ఘన ఇంధనంతో పనిచేస్తుంది.
'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యమే అసలు బలం
భారత్ 'నో ఫస్ట్ యూస్' విధానాన్ని పాటిస్తుంది. ఒకవేళ శత్రువు మనపై మొదటి అణు దాడి చేసినా, సముద్ర గర్భంలో దాగి ఉన్న అరిఘాత్ వంటి జలాంతర్గాముల ద్వారా తిరిగి శత్రువును నామరూపాలు లేకుండా చేసే 'సెకండ్ స్ట్రైక్' సామర్థ్యం ఇప్పుడు భారత్కు తిరుగులేని విధంగా లభించింది.
అగ్రరాజ్యాల సరసన భారత్
ప్రస్తుతం అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్ వంటి అగ్రరాజ్యాల వద్ద మాత్రమే సముద్ర గర్భం నుంచి అణు క్షిపణులను ప్రయోగించే సాంకేతికత ఉంది. ఇప్పుడు భారత్ కూడా ఆ ఎలైట్ క్లబ్లో తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. త్వరలోనే 5,000 కిలోమీటర్ల పైగా పరిధి ఉన్న కే-5 (K-5) క్షిపణులను కూడా భారత్ పరీక్షించనుంది. ఈ విజయంతో భారత్ రక్షణ కవచం అజేయంగా మారిందని, సరిహద్దుల్లో శత్రువుల కదలికలకు ఇది గట్టి హెచ్చరిక అని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ ప్రయోగం కేవలం సాంకేతిక విజయం మాత్రమే కాదు, భారత జలాల్లోకి చొరబడాలని చూసే శత్రువులకు పంపిన బలమైన హెచ్చరిక. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన కే-4, రక్షణ రంగంలో 'ఆత్మనిర్భర్ భారత్' నినాదానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది. త్వరలోనే 5,000 కిలోమీటర్ల లక్ష్యాన్ని చేధించగల కే-5 క్షిపణిని సిద్ధం చేస్తూ, భారత్ తన అజేయ శక్తిని మరింత విస్తరించుకోనుంది. నింగి, నేల, ఇప్పుడు నీటి అడుగున కూడా భారత్ అజేయంగా మారింది.. నవభారత రక్షణ చరిత్రలో ఇదొక సువర్ణ అధ్యాయం.