Pahalgam attack: యాంటీ షిప్ మిసైల్స్ను పరీక్షించిన భారత నౌకాదళం!
ఏ పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధం;
పహల్గాం ఉగ్రదాడితో భారత్-పాక్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. పాకిస్థాన్ ప్రభుత్వం, నేతలు కొన్ని రోజులుగా చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు గమనిస్తే.. పాకిస్థాన్ ఖయ్యానికి కాలు దువ్వుతున్నట్లు కనిపిస్తోంది. శత్రుదేశానికి ధీటుగా సమాధానమిచ్చేందుకు భారత్ అప్రమత్తమవుతోంది. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం సిద్ధమవుతోంది. తాజాగా అరేబియా సముద్రంలో నౌకా విధ్వంసక క్షిపణులను పరీక్షించింది. భారత్ సైతం పాక్ను తిప్పికొట్టేందుకు సన్నద్ధమవుతోందని చూయించేందుకు ఈ క్షిపణులను పరీక్షించింది. సముద్ర జలాల్లో భారత ప్రయోజనాలను కాపాడేందుకు ఇండియన్ నేవీ సిద్ధంగా ఉందని సోషల్ మీడియా వేదిక ద్వారా ప్రకటించింది.
కాగా.. ఇటీవలే భారత నేవీకి చెందిన స్వదేశీ గైడెడ్ క్షిపణి విధ్వంసక నౌక ఐఎన్ఎస్ సూరత్ నుంచి సీ స్కిమ్మింగ్ టార్గెట్లను ఛేదించే సత్తా కలిగిన క్షిపణిని పరీక్షించింది. 70 కిలోమీటర్ల పరిధిలో టార్గెట్లను ఛేదించగలిగిన మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్(ఎంఆర్-ఎస్ఏఎం)ను పరీక్షించారు. ఈ సందర్భంగా లక్ష్యాన్ని అది అత్యంత కచ్చితత్వంతో ఛేదించిందని భారత నౌకాదళం గురువారం వెల్లడించింది. కాగా, ఈ ఏడాది జనవరిలో ప్రధాని మోడీ ముంబైలోని నేవల్ డాక్ యార్డులో ఐఎన్ఎస్ సూరత్ను ప్రారంభించారు. ఇదొక పీ15బీ క్షిపణి విధ్వంసక యుద్ధనౌక.