Rajnath Singh: చైనా రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్తో రాజ్నాథ్ సింగ్ భేటీ..
భారత్- చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటంపై కీలక చర్చ..;
చైనాలో షాంఘై సహకార సంస్థ సమ్మిట్ లో భారత రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పాల్గొన్నారు. ఆ తర్వాత బీజింగ్ రక్షణ శాఖ మంత్రి అడ్మిరల్ డాంగ్జున్తో ఆయన ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపడటం, సరిహద్దుల్లో సమస్యలు రాకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వీరిద్దరూ కీలక చర్చలు జరిపినట్లు తెలుస్తుంది. ఇక, ఇరు దేశాల మధ్య సరిహద్దు ఉద్రిక్తతల పరిష్కారానికి నాలుగు అంశాల ఫార్ములాను రాజ్నాథ్ సింగ్ ప్రతిపాదించినట్లు సమాచారం. ఇందులో బలగాల ఉపసంహరణను కొనసాగించడం, ఉద్రిక్తతలను తగ్గించుకోవడం, సరిహద్దుల గుర్తింపు-నిర్ధారణ, విభేదాలను తొలగించి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవడం లాంటి కీలకాంశాలు ఉన్నట్లు పలు జాతీయ మీడియాల్లో కథనాలు ప్రచురితం అవుతున్నాయి.
అలాగే, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని భారత్- చైనా మధ్య సంబంధాలు తిరిగి ఏర్పాటు చేసుకునేందుకు ప్రణాళికలు సిద్ధ చేసుకుంటున్నాయని రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇక, దాదాపు ఆరు సంవత్సరాల విరామం తర్వాత కైలాష్ మానసరోవర్ యాత్ర పునఃప్రారంభం కావడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సానుకూల దృక్పథాన్ని కొనసాగించడం పాటు ద్వైపాక్షిక సంబంధానికి కొత్త సంక్లిష్టతలు రాకుండా ఇరు దేశాలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.