Jammu Kashmir : అక్టోబర్ లో జమ్మూకశ్మీర్ కు రాష్ట్ర హోదా

Update: 2024-08-09 08:15 GMT

ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూకశ్మీరు రాష్ట్రం హోదా పునరుద్ధరించే అంశంపై కేంద్ర సహాయ మంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు రాందాస్ అథవాలే కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్లో రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందన్నారు.

శ్రీనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ "అక్టోబర్లో మహారాష్ట్ర, హరియానా, ఝార్ఖండ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అందువల్ల, బహుశా జమ్మూకశ్మీర్కు కూడా రాష్ట్ర హోదా పునరుద్ధరణతో పాటు అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై ప్రకటన అక్టోబర్లో వెలువడే అవకాశం ఉంది. ఎన్నికలు జరిగినప్పుడు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలి. లోక్ సభ ఎన్నికల సమయంలో భారీగా తరలివచ్చి ఓట్లు వేసినందుకు అభినందనలు. జమ్మూకశ్మీర్ పురోగమిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో ఓటు వేయాలి" అని విజ్ఞప్తి చేశారు.

"జమ్మూకశ్మీర్ అసెంబ్లీకి మేమూ పోటీ చేస్తాం. ఎన్డీయేలో భాగస్వామిగా ఉన్న తన రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా సైతం జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో 10 నుంచి 15 మంది అభ్యర్థులను బరిలో దింపుతుందని" అథవాలే ప్రకటించారు. ఆర్టికల్ 370 ని రద్దు చేసిన సమయంలో కేంద్ర హోంమంత్రి అమి త్ షా జమ్మూకశ్మీర్కు తిరిగి రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తానని హామీ ఇచ్చారని గుర్తు చేశారు.

Tags:    

Similar News