అవినీతి ఆరోపణలతో ఈడీ అరెస్టు చేయడం ద్వారా ఢిల్లీ సీఎం కేజ్రివాల్ (Arvind Kejriwal) అరుదైన రికార్డు లిఖించారు. పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి ముఖ్యమంత్రిగా నిలిచారు. గతంలో పలువురు ముఖ్యమంత్రులు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. అయితే వారంతా పదవి నుంచి వైదొలగిన తర్వాత బేడీలు తగిలించుకున్నారు. లాలూ యాదవ్, జయలలిత నుంచి ఓం ప్రకాశ్ చౌతాలా, మధు కొడా, హేమంత్ సొరేన్ వంటి నేతలు అరెస్టయిన మాజీ ముఖ్యమంత్రుల జాబితాలో ఉన్నారు.
1990-97 మధ్యకాలంలో దాణా కుంభకోణం కేసులో అప్పటి ఆర్జేడీ చీఫ్ లాలూతోపాటు మరొక మాజీ సీఎం జగన్నాథ్ మిశ్రా జైలుపాలయ్యారు. 1991- 2016 మధ్య కాలంలో తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన జయలలిత మొదటిసారి 1996లో అరెస్టయ్యారు. 1989-2005 మధ్య హర్యానా సీఎంగా ఉన్న ఓంప్రకాశ్ చౌతాలా, ఉపాధ్యాయ నియామకాల్లో అవినీతి ఆరోపణలపై 2013లో దోషిగా తేలారు. మైనింగ్ కేసులో జార్ఖండ్ మాజీ సీఎంలు మధుకొడా (2009), హేమంత్ సోరెన్ (2024) అరెస్టయ్యారు.