మనీ లాండరింగ్ కేసులో లాలూ ప్రసాద్ యాదవ్ ( Lalu Prasad yadav ), తేజస్వినీ యాదవ్కు ( Tejaswini Yadav ) షాక్ తగిలింది. వీరిద్దరికి ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు బుధవారం సమన్లు జారీ చేసింది. ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ‘భూమికి ఉద్యోగం కుంభకోణం’తో సంబంధమున్న మనీలాండరింగ్ కేసులో దిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు లాలూకు సమన్లు జారీ చేసింది. ఏకే ఇన్ఫోసిస్ లిమిటెడ్కు డైరెక్టర్ ప్రతాప్ యాదవ్కు, మరికొందరికి న్యాయస్థానం సమన్లు పంపింది. అక్టోబరు 7లోపు తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. 2004 నుంచి 2009 మధ్య లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో భారతీయ రైల్వేలో గ్రూప్-డి ఉద్యోగాల నియామకాల్లో అవకతవకలు జరిగినట్లు సీబీఐ అభియోగాలు నమోదు చేసింది. ఇదే వ్యవహారంపై నగదు అక్రమ చెలామణి నిరోధక చట్టం కింద ఈడీ కేసు నమోదు చేసింది. గతేడాది మార్చిలో దిల్లీ, బిహార్, ముంబయిలలో మొత్తం 25 చోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. అనంతరం లాలూ కుటుంబసభ్యుల్లో ముగ్గురితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు, రెండు సంస్థల పేర్లతో ఛార్జిషీట్ను దాఖలు చేసింది. లాలూ సతీమణి, బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, కుమార్తెలు ఎంపీ మీసా భారతి, హేమా యాదవ్, లాలూ కుటుంబ సన్నిహితుడు అమిత్ కత్యాల్, రైల్వే ఉద్యోగి, లబ్ధిదారుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న హృదయానంద్లతోపాటు ఏకే ఇన్ఫోసిస్టమ్స్, ఏబీ ఎక్స్పోర్ట్స్లపై అభియోగాలు మోపింది.