Salary Scam: 50,000 నకలీ ప్రభుత్వ ఉద్యోగులు.. రూ.230 కోట్ల వేతన కుంభకోణం

మధ్యప్రదేశ్‌లో భారీ శాలరీ స్కామ్‌;

Update: 2025-06-07 02:00 GMT

బీజేపీ నేతృత్వంలోని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో భారీ స్థాయిలో జీతాల కుంభకోణానికి స్కెచ్‌ వేశారా? లేని ఉద్యోగులను ఉన్నట్లుగా సృష్టించి వారి పేరున జీతాలు స్వాహా చేయడానికి కుట్ర జరిగిందా? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానం వినిపిస్తున్నది. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన 50,000 మంది ఉద్యోగులకు గత ఆరు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించడం లేదు. మధ్యప్రదేశ్‌ ప్రభుత్వంలో పని చేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్యలో 9 శాతం ఉండే ఈ 50 వేల మంది ప్రభుత్వ ఉద్యోగుల ఉనికిపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ మధ్యప్రదేశ్‌ చరిత్రలోనే ఇది అతి పెద్ద జీతాల కుంభకోణంగా బయటపడే అవకాశం కనపడుతున్నది.

ఈ 50,000 మందిలో 40,000 మంది శాశ్వత ఉద్యోగులు, 10,000 మంది తాత్కాలిక సిబ్బంది. వారి జీతాలు మొత్తం రూ. 230 కోట్లు. జీతాలు చెల్లించకపోవడంతో, గోస్ట్ ఉద్యోగులు లేదా పెద్ద ఎత్తున మోసం జరిగిందనే అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ రూ. 230 కోట్లు ఎక్కడ ఉన్నాయి? ఈ ఉద్యోగులలో కొంతమంది గోస్ట్ ఉద్యోగులైతే, ఎవరు ఈ వ్యవస్థను మోసం చేస్తున్నారు? ఈ 9 శాతం ఉద్యోగులు లేకుండా విభాగాలు ఎలా నడుస్తున్నాయి? ఈ కుంభకోణం వెనుక ఉన్న రహస్యాలను వెలికితీసేందుకు పరిశోధన కొనసాగుతోంది.

అధికారిక దస్ర్తాలలో కనిపిస్తున్న ఈ ఉద్యోగులకు సంబంధించిన పత్రాలను ఎన్‌డీటీవీ సేకరించింది. ప్రతి ఉద్యోగి పేరు, ఎంప్లాయీ కోడ్‌ ఆ దస్ర్తాలలో ఉంది. అయితే గడచిన ఆరు నెలలుగా వారికి జీతాలను చెల్లించే ప్రక్రియ మాత్రం జరగలేదు. రూ. 230 కోట్ల అవినీతి జరగడానికి ఆస్కారం ఉన్న ఈ కుంభకోణంపై ఈ ఖాతాలకు జీతాలు ఇప్పటి వరకు వెళ్లలేదని తాను కచ్చితంగా చెప్పగలనని, దీనిపై తాము వెంటనే చర్యలు తీసుకున్నామని కమిషనర్‌ ఆఫ్‌ ట్రెజరీ అకౌంట్స్‌ భాస్కర్‌ లక్ష్‌కర్‌   తెలిపారు.

Tags:    

Similar News