పశ్చిమ బెంగాల్ హత్యాచార ఘటనకు వ్యతిరేకంగా నిరసనలు కొనసాగిస్తున్న జూనియర్ డాక్టర్లకు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య చర్చల విషయమై ప్రతిష్టంభన కొనసాగుతున్న వేళ సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజల ప్రయోజనం కోసం అవసరమైతే తాను రాజీనామా చేసేందుకు కూడా సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆర్జీ కర్ ఘటనలో బాధితురాలికి న్యాయం చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్లతో సమావేశం కోసం గురువారం దాదాపు రెండు గంటలపాటు ఎదురుచూశానని, అయినప్పటికీ వారి నుంచి స్పందన లేకుండా పోయిందని తెలిపారు. నేటితో ఈ సమస్యకు తెరపడుతుందని ఆశించిన రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నానన్నారు.‘ప్రస్తుతం ఈ కేసు కోర్టు పరిధిలో ఉంది. అందువల్ల.. జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేసినట్లు చర్చలను ప్రత్యక్ష ప్రసారం చేయలేం. ఈ భేటీ వీడియో రికార్డింగ్కు ఏర్పాట్లు చేశాం. సుప్రీంకోర్టు అనుమతితో ఆ ఫుటేజీని డాక్టర్లకు అందజేస్తాం. చర్చలు జరిపేందుకు ఇప్పటికే మూడుసార్లు యత్నించాను. డాక్టర్లు విధులకు దూరంగా ఉండటంతో ఏడు లక్షల మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారు. 27 మంది మృతి చెందారు. ఆందోళన చేస్తున్న జూనియర్ డాక్టర్లపై ఎలాంటి చర్యలు తీసుకోను. పెద్దవాళ్లం కాబట్టి వారిని క్షమిస్తాను’ అని మమతా బెనర్జీ చెప్పారు. హత్యాచార బాధితురాలికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ బెంగాల్ వ్యాప్తంగా వైద్యవిద్యార్థులు చేస్తున్న నిరసనలు నెల రోజులకుపైగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వారితో చర్చలు జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా బుధవారం సాయంత్రం చర్చలకు రావాలని ఆహ్వానించగా.. 30 మంది ప్రతినిధులకు అనుమతించాలని, ఈ భేటీని ప్రత్యక్ష ప్రసారం చేయాలంటూ వారు షరతులు విధించారు. వాటిని తిరస్కరించిన ప్రభుత్వం.. గురువారం మరోసారి చర్చలకు ఆహ్వానించింది. ఈ క్రమంలోనే డాక్టర్లు రాష్ట్ర సెక్రటేరియట్ కు చేరుకున్నప్పటికీ.. సమావేశానికి హాజరుకాలేదు.