తన ప్రేమను నిరాకరించిందని వివాహితను దారుణంగా హత్యచేసిన ఘటన కర్ణాటకలోని హసన్ జిల్లాలో చోటుచేసుకున్నది. హసన్ జిల్లా బేలూరు తాలూకా చందనహళ్లి గ్రామానికి సమీపంలో బేలూరుకు చెందిన శ్వేత. తన భర్తను వదిలేసి పుట్టింటిలో ఉంటున్నది. హసన్లో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవిస్తున్నది. ఈ క్రమంలో ఆమెకు రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. అయితే తన భార్యను విడిచిపెట్టి వస్తానని, తనను పెళ్లాడాలని గత కొంతకాలంగా ఆమెను సతాయిస్తున్నాడు. దానికి నిరాకరించడంతో రవి ఆమెపై కోపం పెంచుకున్నాడు.
ఈ క్రమంలో శ్వేతను హతమార్చాలని నిర్ణయించుకున్న అతడు.. పక్కా పథకం ప్రకారం.. బయటకు వెళ్దామని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. చందనహళ్లి చెరువు వద్దకు రాగానే కారును ఆపి.. ఆమెను అందులోనే ఉంచి చెరువులోకి తోసేశాడు. తర్వాత కారు అనుకోకుండా చెరువులో పడిందని, అందులో తన స్నేహితురాలు ఉందని, తాను ఎలాగోలా ఈత కొట్టుకుంటూ బయటపడ్డాడనని పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న అరేహళ్లి పోలీసులు కారును బయటకు తీశారు. రవిని తమదైన స్టైల్లో ప్రశ్నించడంతో తానే ఆమెను చంపేశానని అసలు నిజం ఒప్పుకున్నాడు. శ్వేత కుటుంబం ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసిన పోలీసులు.. నిందితుడిని అరెస్టు చేశారు.