మరోవైపు మహారాష్ట్రలో మరో రైలు ప్రమాదం తప్పింది. ముంబై - సికింద్రాబాద్ దేవగిరి ఎక్స్ప్రెస్ వెళ్తుండగా.. పట్టాలపై రాళ్లతో నింపిన డ్రమ్మును పెట్టారు దుండగులు. గమనించిన లోకో పైలట్ ఎమర్జెన్సీ బ్రేక్లు వేసి రైలును ఆపారు. దీంతో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో సతోనా - ఉస్మాన్పుర్ స్టేషన్ల మధ్య ప్రయాణిస్తుండగా పట్టాలపై వస్తువు ఉండటాన్ని లోకో పైలట్ గుర్తించారు. అప్రమత్తమైన పైలట్ రైలును ఆపి కిందకు దిగి చూడగా.. ట్రాక్ మధ్యలో రాళ్లతో నిండిన డ్రమ్ము కనిపించింది. వెంటనే రైల్వే భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. ఆర్పీఎఫ్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఆ డ్రమ్మును తొలగించారు. ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నారు.