PM Modi : మోడీ ఎఫెక్ట్.. చైనా రికార్డ్ బ్రేక్! చీనాబ్ బ్రిడ్జ్‌పై రైలు పరుగులు

Update: 2024-06-21 08:35 GMT

జమ్మూకశ్మీర్ లోని చీనాబ్ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెనపై తొలిసారిగా ఓ పూర్తిస్థాయి రైలు పరుగులు పెట్టింది. ఇంజినీరింగ్ అద్భుతంగా నిలిచిన ఈ చారిత్రక వంతెనపై రైలు ట్రయల్ రన్ ను గురువారం విజయవంతంగా నిర్వహించారు.

కశ్మీర్ భారత్లోని మిగతా ప్రాంతాలతో అను సంధానించేందుకు చేపట్టిన ఉధంపుర్- శ్రీనగర్ - బారాముల్లా రైల్వే ప్రాజెక్టులో భాగంగా చీనాబ్ వంతెనను నిర్మించారు. నదీగర్భం నుంచి 359 మీటర్ల ఎత్తున ఉన్న ఈ రైల్వే వంతెన పొడవు 1,315 మీటర్లు. ఇప్పటివరకూ చైనాలోని బెయిపాన్ నదిపై నిర్మించిన 75 మీటర్ల పొడవైన షుబాయ్ రైల్వే వంతెన పేరుతో ఉన్న ప్రపంచ రికార్డును ఇది అధి గమించింది. పారిస్ లోని ప్రఖ్యాత ఐఫిల్ టవర్తో పోలిస్తే దీని ఎత్తు 30 మీటర్లు ఎక్కువ.

ఈ విషయాన్ని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సంగల్షన్ నుంచి రియాసీ వరకు రైలును ప్రయోగాత్మకంగా నడిపారు. మధ్యలో చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనపై ప్రధాన రైలు పరుగులు పెడుతున్న దృశ్యాలు వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ బ్రిడ్జ్ పై జూన్ 16న ఓ రైలు ఇంజిన్ ట్రయల్ రన్ నిర్వ హించారు. చీనాబ్ నదిపై కట్టిన ఈ రైల్వే వంతెన మీదుగా రాంబన్ నుంచి రియాసీకి అతి త్వరలో రైలు సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

Tags:    

Similar News