భారత్ విశ్వగురువు అని చెప్పుకోవడం కాదు నిరూపించాలని కేంద్రంపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్-ఇజ్రాయిల్ మధ్య శాంతిని నెలకొల్పే లా భారత్ చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవుడు ఇచ్చిన అధికారాన్ని మోదీ ఉపయోగించుకోవాలని సూచించారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇరాన్-ఇజ్రాయిల్ యుద్ధాన్ని ఆపేందుకు ఆ దేశాధ్యక్షులకు లేఖ రాయాలని డిమాండ్ చేశారు.
మూడో ప్రపంచ యుద్ధం వస్తే 10 నుంచి 20 కోట్ల మంది చనిపోతారని వెల్లడించారు. ఇరాన్ తో శాంతి చర్చలు జరపకుండా ఇజ్రాయిల్ ప్రధాని హిట్లర్ లా వ్యవహరిస్తున్నారని చెప్పారు. ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ఎంత మంది చనిపోయారో ఇప్పటి వరకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించలేదని మండిపడ్డారు. విమాన ప్రమాదంలో 241 వద్ద చనిపోయిన 38 మందికి ప్రభుత్వం కోటి రూపాయల చొప్పున ప్రకటించాలని కోరారు. మెడికల్ కళాశాల వద్ద చనిపోయినవారు మనుషులు కాదా..? అని ప్రశ్నించారు. ఎయిర్ ఇండియా ప్రమాద బాధితులకు న్యాయం చేసే వరకు పోరాడుతానంటూ స్పష్టం చేశారు.