Ram Rahim: అయోధ్య ప్రాణప్రతిష్ఠ వేళ ప్రసవాలు..
ముస్లిం బిడ్డకు రామ్ రహీమ్గా నామకరణం;
అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగిన సోమవారం నాడే దేశవ్యాప్తంగా అనేక మంది తల్లులు బిడ్డలకు జన్మనిచ్చారు. ఆ శుభముహుర్తంలో బిడ్డను కనాలని సిజేరియన్లకు ప్రాధాన్యం ఇచ్చారు. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ రోజు పలువురు గర్భిణులకు జీవితంలో మరిచిపోలేని క్షణాలుగా మిగిలిపోయాయి. సోమవారం దేశంలో అనేక మంది శిశువులు జన్మించారు. ఆ శిశువులలో చాలామందికి రామ్, సీత అనే పేర్లు పెట్టారు వారివారి తల్లిదండ్రులు.
హిందువుల చిరకాల స్వప్నం అయిన అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి చేసుకుని ప్రారంభోత్సవం కూడా జరిగింది. ఈ సందర్భంగా కేవలం భారతదేశంలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న హిందువులు అందరూ ఒక గొప్ప పండుగ లాగా ఈ వేడుకను జరుపుకున్నారు. ఇక అయోధ్య ప్రాణప్రతిష్ఠ జరిగిన ముహూర్తం మంచిదని భావించిన చాలా మంది తమ జీవితంలో ముఖ్యమైన పనులను చేసుకున్నారు. ఇక గర్భిణీలు తాము అయోధ్యలో రాముడు కొలువు దీరనున్న సమయంలోనే ప్రసవించాలని పట్టుబట్టి మరీ ఆపరేషన్లు చేయించుకున్నారు. ఈ క్రమంలోనే ఓ ముస్లిం మహిళ.. తనకు పుట్టిన బిడ్డకు హిందూ, ముస్లిం మతాలకు సంబంధించిన పేర్లు రెండు కలిపి పెట్టింది.
ఇక దేశవ్యాప్తంగా వేల సంఖ్యలో ఇలా ప్రసవాలు జరిగినట్లు తెలుస్తోంది. బిహార్ రాజధాని పాట్నాలోని పలు ఆస్పత్రుల్లో సోమవారం 500 మంది శిశువులు జన్మించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. మధ్యప్రదేశ్లోని 3 జిల్లాల్లో ఉన్న వివిధ హాస్పిటల్లలో సోమవారం కనీసం 47 మంది పిల్లలు పుట్టినట్లు అక్కడి అధికారులు గణాంకాలు విడుదల చేశారు. ఉత్తర్ప్రదేశ్లోని కాన్పుర్ గణేశ్ శంకర్ ఆస్పత్రిలో సోమవారం ఒక్కరోజే 25 మందికి కాన్పులు జరిగినట్లు డాక్టర్లు తెలిపారు. మధ్యప్రదేశ్ ఇండోర్లోని కేవలం 2 ఆస్పత్రుల్లోనే 15 మంది బిడ్డలకు జన్మనిచ్చారు. అందులో 11 మందివి నార్మల్, నలుగురివి సిజేరియన్ డెలివరీలు అని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి.
ఉత్తర్ప్రదేశ్ సంభల్ జిల్లాలోని ఓ ఆస్పత్రి కాన్పుల వార్డులో అయోధ్య రామ మందిర నమూనాను ఏర్పాటు చేశారు. కర్ణాటకలోని విజయపురలో జె.ఎస్.ఎస్. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో సోమవారం 20 మందికిపైగా మహిళలకు కాన్పులు జరిగినట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.