యూపీలోని హత్రాస్లో దారుణంగా అత్యాచారానికి గురైన ఘటనను.. జాతీయ మానవహక్కుల సంఘం తీవ్రంగా పరగణించింది. ఈ సంఘటనను సుమోటో కేసుగా స్వీకరించినట్టు NHRC తెలిపింది. ఈ ఘోర ఘటనలో 19 ఏళ్ల ఓ దళిత యువతిని నలుగురు వ్యక్తులు అత్యాచారం చేసి .. తీవ్రంగా హింసించారు. ఈ దారుణంలో గాయపడిన ఆమె.. మృత్యువుతో పోరాడి రెండు రోజుల క్రితం ఢిల్లీలోని సఫ్దర్జంగ్ ఆసుపత్రిలో మరణించింది. అత్యాచార ఘటనపై వివరణ కోరుతూ యూపీ ప్రభుత్వం, ఆ రాష్ట్ర డీజీపీకి నోటీసులు జారీచేసింది జాతీయ మానవహక్కుల సంఘం.
సెప్టెంబర్ 14న తన తల్లితో కలిసి పొలానికి వెళ్లిన యువతి.. ఆ తర్వాత కనిపించకుండా పోయింది. తీవ్రంగా గాయపడిన స్థితిలో ఆమెను.. కనుగోన్నారు. ముందుగా బాధితురాలిని చికిత్స కోసం అలీఘడ్లోని జవహర్లాల్నెహ్రూ హాస్పిటల్లో చేర్చారు. ఆతర్వాత మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ తరలించారు. తెగిన నాలిక, శరీరంపై ఇతర తీవ్రమైన గాయాలతో ఆమె ప్రాణాలు విడిచింది. ఆ తర్వాత.. అర్థరాత్రి దాటాక.. ఆమె మృతదేహాన్ని స్వగ్రామం హత్రాస్ తరలించి పోలీసులే అంత్యక్రియలు నిర్వహించారు. కనీసం కుటుంబ సభ్యులను యువతిని చివరి చూపు చూసేందుకు అనుమతించలేదు.
హత్రాస్ అత్యాచార ఘటనపై... దళిత సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తను ఆందోళనలు చేశాయి. యోగీ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డాయి. అర్థరాత్రి అంత్యక్రియలు నిర్వహించడాన్ని సోషల్ మీడియా సహా యూపీ, ఢిల్లీలో నిరసనలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం ఆ నలుగురు నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారు. ఈ ఘటనపై సీరియస్ అయిన సీఎం యోగి ఆధిత్యనాథ్ ప్రత్యేక సిట్ ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ కూడా.. యోగికి ఫోన్ చేసి.. నిందితుల్ని కఠినంగా శిక్షించాలన్నారు. ఇప్పుడీ ఘటనపై.. NHRC సుమోటోగా కేసు నమోదు చేయడంతో.. మరింత హీట్ పెరిగినట్టయింది.